
రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ పై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ట్వీట్టర్ వార్ కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్,ఎమ్మెల్సీ కవిత, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ఇవాళ ఉదయం నుంచి ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురుస్తోంది. రాహుల్ గాంధీ తెలంగాణలో ఎందుకు పర్యటిస్తున్నారో చెప్పాలని కవిత ప్రశ్నించగా.. రాహుల్ గాంధీ స్టడీ టూర్ కి స్వాగతం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉత్తమ రైతు, స్నేహపూర్వక పద్ధతులను తెలుసుకొని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించారు.
మీ పాలన పై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్!
— Revanth Reddy (@revanth_anumula) May 6, 2022
రుణమాఫీ హామీ ఎలా ఎగగొట్టాలి?
ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి? మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలాబిగించాలి?
వరి,మిర్చీ,పత్తి రైతులు ఎలా చస్తున్నారు?
ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్ వస్తున్నారు. https://t.co/dta7YoZNkY
కేటీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. మీ పాలన పై ఏం అధ్యయనం చేయాలి అని ప్రశ్నించారు. ‘రుణమాఫీ హామీ ఎలా ఎగ గొట్టాలి?ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి? మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలాబిగించాలి? వరి, మిర్చీ,పత్తి రైతులు ఎలా చస్తున్నారు? ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్ వస్తున్నారని’ రేవంత్ బదులిచ్చారు.
అంతకు ముందు టీఆర్ఎస్ నేతలకు ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు వేశారు రేవంత్. రాహుల్ ని ప్రశ్నించే ముందు తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరెక్కడున్నారని ప్రశ్నించారు. మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి.. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వమని లేఖ ఇచ్చి.. రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరెక్కడున్నారని ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డారు రేవేంత్ రెడ్డి. వరివేస్తే ఉరి అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి.. ఫాం హౌస్ లో 150 ఎకరాల్లో వరి వేసినప్పడు ఎక్కడున్నారని కవితపై విమర్శలు గుప్పించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిర్చీ రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ఒక్క టీఆర్ఎస్ నేత పరామర్శించలేదన్నారు.
రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తానని కేసీఆర్ మోసం చేశారన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతులకు అవసరమైన 26 లక్షల టన్నుల ఎరువు ఫ్రీగా ఇస్తానని చెప్పి ఐదేళ్లవుతున్నా.. అరక్వింటా ఎరువులు కూడా ఇవ్వలేదన్నారు. అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యపురాశులు తడిచి రైతులు విలపిస్తున్నారని.. వారి కష్టాన్ని పట్టించుకోలేదన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీతో కలిసి డ్రామాలాడారన్నారు. కనీస మద్దతు ధర కన్నా తక్కువగా 14 వందల రూపాయలకే రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు రేవంత్ రెడ్డి.