అమెరికాలో ఒక్కరోజే  లక్షన్నర కేసులు

అమెరికాలో ఒక్కరోజే  లక్షన్నర కేసులు
  • అమెరికాలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది.
  • మంగళవారం లక్షన్నర కేసులు నమోదయ్యాయి.
  • దీంతో ఆంక్షలను తిరిగి అమలు చేసేందుకు
  •  అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్.. ఫ్లోరిడాతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో వైరస్​ విజృంభిస్తోంది. పద్దెనిమిదేండ్లు నిండిన వాళ్లలో 70% మంది వ్యాక్సిన్​ వేయించుకున్నారు. అయినా, మూడు నాలుగు రోజులుగా రోజూ 70 వేల నుంచి లక్ష దాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం నాటికి కేసుల సంఖ్య లక్షన్నరకు చేరింది. 24 గంటల్లో అమెరికా వ్యాప్తంగా 1,49,788 మందికి కరోనా సోకింది. వైరస్​తో 516 మంది చనిపోయారు. మొత్తం  కరోనా కేసుల సంఖ్య 3.53 కోట్లకు, మొత్తం మృతుల సంఖ్య 6.14 లక్షలకు చేరుకుంది. మరోవైపు, ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో మంగళవారం ఒక్కరోజే 11,515 మంది కరోనా పేషెంట్లు ఆస్పత్రిలో అడ్మిట్​ అయ్యారు. గతంలో వైరస్​ వ్యాప్తి తీవ్రంగా ఉన్నపుడు ఈ స్థాయిలో పేషెంట్లు అడ్మిట్​ అయ్యారని అధికారులు చెప్పారు. కరోనా కేసులు తగ్గడంతో గతంలో సడలించిన ఆంక్షలను తిరిగి అమలుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వ్యాక్సిన్​ అందుబాటులోకి రావడంతో పాటు వైరస్ బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కరోనాపై విజయం సాధించామని జులై 4 న ప్రెసిడెంట్​జో బైడెన్​ ప్రకటించారు. అయితే, పరిస్థితి మళ్లీ అదుపుతప్పుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధిక కేసులు ఒక్క అమెరికా నుండే వస్తున్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో అగ్రరాజ్యం వణికిపోతోంది.