ట్రైన్‌లో డెలివరీ.. తల్లీబిడ్డ క్షేమం

ట్రైన్‌లో డెలివరీ.. తల్లీబిడ్డ క్షేమం
  • రామగుండం రైల్వే స్టేషన్ లో ఏపీ ఎక్స్ ప్రెస్ లో ఘటన

 గోదావరిఖని, వెలుగు : రైలు ప్రయాణిస్తున్న నిండు గర్భిణికి పురిటినొప్పులు రావడంతో రామగుండం రైల్వే స్టేషన్​లో ట్రైన్​లోనే 108 సిబ్బంది డెలివరీ చేశారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. కరీంనగర్​కు చెందిన సోమ ప్రవీణ్​కుమార్​ఆగ్రాలో ప్రైవేటు జాబ్​చేస్తున్నాడు. ఆయన భార్య స్వాతికి ఎనిమిది నెలలు నిండడంతో ఇంటికి తీసుకొస్తున్నాడు. ఢిల్లీ నుంచి వైజాగ్ వెళ్లే ఏపీ ఎక్స్​ప్రెస్​లో వస్తుండగా బుధవారం సాయంత్రం మందమర్రికి రైలు రాగానే ఒక్కసారిగా స్వాతికి పురుటి నొప్పులు మొదలయ్యాయి.  

టీసీ  వెంటనే 108 సిబ్బందికి ఫోన్​ చేయగా గోదావరిఖని 108 ఈఎంటీ అబ్దుల్​చాంద్​, పైలట్ఎస్​.రవి రైలు రామగుండం రైల్వే స్టేషన్ కు చేరారు. రైలులోనే స్వాతికి డెలివరీ చేశారు. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు రైలును  స్టేషన్​లో నిలిపివేశారు. స్వాతికి మగ శిశువు జన్మించగా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.  చికిత్స నిమిత్తం గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఎమర్జెన్సీ టైమ్ లో  స్పందించి రైలులో డెలివరీ చేసిన 108 సిబ్బందిని ప్రయాణికులు 
అభినందించారు.