![పత్తి అమ్మకాలకు ఆధార్ తిప్పలు](https://static.v6velugu.com/uploads/2025/02/aadhaar-server-outage-disrupts-cotton-purchases-in-manchiryala-leaving-farmers-in-distress_io5gqyNmv3.jpg)
- సర్వర్ డౌన్తో నాలుగు రోజులుగా నిలిచిన కొనుగోళ్లు
- అవగాహన లేక ఆందోళనలకు దిగుతున్న రైతులు
- తరచూ బంద్లతో దళారులకు అమ్మకుంటున్న వైనం
మంచిర్యాల, వెలుగు: పత్తి అమ్మకాలకు ఆధార్అడ్డంకిగా మారింది. సర్వర్ డౌన్ కావడంతో నాలుగు రోజులుగా కాటన్ కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ విషయం తెలియక రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. వ్యవసాయ మార్కెట్లు, జిన్నింగ్మిల్లులు వద్ద తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నారు. వెహికల్స్కు వెయిటింగ్చార్జీలు తడిసిమోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు సీసీఐ, మార్కెటింగ్ అధికారులు వివిధ కారణాలతతో తరచూ సెంటర్లను బంద్ చేయడంతో గత్యంతరం లేక దళారులకు అమ్ముకుంటున్నారు.
సర్వర్ డౌన్.. కొనుగోళ్లకు బ్రేక్
కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు చేపట్టింది. ఇందుకోసం వ్యవసాయ మార్కెట్లు, జిన్నింగ్ మిల్లుల్లో ప్రత్యేకంగా సెంటర్లను ఏర్పాటుచేసింది. కొనుగోళ్లలో అవకతవకలను అరికట్టేందుకు ఆధార్ కార్డును లింక్ చేసింది. రైతులు ఎన్ని ఎకరాల్లో పత్తి వేశారు? ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వచ్చింది? అనే వివరాలను ఏఈవోలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అనంతరం పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు తీసుకొని సీసీఐ సెంటర్కు వెళ్లాలి.
అక్కడ వాటిని పరిశీలించి అన్నీ సరిగా ఉన్నాయా, లేదా అని నిర్ధారించుకుం టారు. ఆధార్నంబర్ ఎంటర్ చేయగానే దానికి లింక్చేసుకున్న ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది.ఆన్లైన్ప్రాసెస్ పూర్తికాగానే పత్తిని కాంటా వేస్తారు. కానీ ఈ నెల 10 నుంచి ఆధార్ సర్వర్ డౌన్ కావడంతో ఆధార్ అథెంటికేషన్ కావడం లేదు. ఈ కారణంగా నాలుగు రోజులుగా సీసీఐ సెంటర్లలో కొనుగోళ్లు నిలిచిపోయాయి.
ALSO READ : కృష్ణా జలాల వివాదంపై ట్రిబ్యునల్లో వాదనలు ఆపం..వాటిని వాయిదా వేసే ప్రసక్తే లేదు : సుప్రీంకోర్టు
తిప్పలు పడుతున్న రైతులు
ఆధార్ సర్వర్ డౌన్ కావడంతోనే కొనుగోళ్లు నిలిపివేసిన విషయంపై రైతులకు అవగాహన కల్పించడంలో సీసీఐ, మార్కెటింగ్అధికారులు విఫలమయ్యారు. ఉన్నఫలంగా కొనుగోళ్లు ఆపివేయడంతో ఆగ్రహానికి గురైన రైతులు రోడ్లెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. మొన్న మంచిర్యాల జిల్లా తాండూర్, చెన్నూర్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు చాలాచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఇదే అదునుగా అపోజిషన్ లీడర్లు పత్తి కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యమంటూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు.
దీనికితోడు సీసీఐ, మార్కెటింగ్ అధికారులు దళారులతో కుమ్మక్కై అక్రమాలకు తెరలేపడం, టోకెన్లు అమ్ముకోవడం, టెంపరరీ రిజిస్ట్రేషన్లలో అవకతవకలు, తదితర కారణాలతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. అంతేగాకుండా జిన్నింగ్ మిల్లుల్లో పత్తి నిల్వలు పేరుకుపోయాయని తరచూ సెలవులు ప్రకటిస్తుండడం, ఇలా ప్రతిదానికి కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల రైతులు పత్తిని అమ్ముకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. తాజాగా ఈ నెల 10 నుంచి ఆధార్సర్వర్ డౌన్ కావడంతో కొనుగోళ్లు చేపట్టక జిన్నింగ్ మిల్లులు, మార్కెట్యార్డుల ఎదుట రోడ్లపై ట్రాక్టర్లు, డీసీఎం వ్యాన్లు, ఇతర ట్రాలీ వెహికల్స్ కిలోమీటర్ల మేర బారులు తీరిన దృశ్యాలు అన్నదాతల వెతలకు అద్దం పడుతున్నాయి.
అంతా పరేషాన్ ఉన్నది
నేను ఆదివారం చెన్నూర్మిల్లుకు పత్తి తీసుకొచ్చిన. సోమవారం కాంటా అయితదనుకున్న. కానీ ఆన్లైన్ పని చేస్తలేదని కాంటా బంద్ పెట్టిన్రు. ఇప్పటికే నాలుగు రోజులైంది. తిండి తిప్పలు లేకుండా అవస్థలు పడుతున్నాం. ట్రాక్టర్ కిరాయి రోజుకు రూ.3500. వెయిటింగ్ చార్జి రూ.వెయ్యి తీసుకుంటున్రు. ఆన్లైన్ ఎప్పుడు వస్తదో, కాంటా ఎప్పుడైతదో, ఇంటికి ఎప్పుడు పోతమో.. అంతా పరేషాన్ ఉన్నది. - తిరుపతి, పత్తి రైతు, నెన్నెల
సర్వర్ పునరుద్ధరణ తర్వాతే కొనుగోళ్లు
ఈ నెల 10 నుంచి ఆధార్ సర్వర్ పనిచేయడం లేదు. సర్వర్ డౌన్ కావడం, సాంకేతిక సమస్యలతో సీసీఐ సెంటర్లలో కాటన్ కొనుగోళ్లు నిలిపివేశాం. జిల్లాలోని చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ల పరిధిలోని సెంటర్లను నాలుగు రోజులుగా క్లోజ్ చేశాం. ఆధార్ సర్వర్ పునరుద్ధరణ తర్వాత యథావిధిగా కొనుగోళ్లు చేపడుతాం. అప్పటివరకు రైతులు పత్తిని తీసుకురావద్దు. ఎండీ షాబొద్దీన్, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్, మంచిర్యాల