
- అప్పటిదాకా ఓల్డ్ బిల్డింగులోనే డిగ్రీ క్లాసెస్ను కొనసాగించాలి
- అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ ఏబీవీపీ రాస్తారోకో
హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనంలో ఎలాంటి వసతులు లేకున్నా, అధికారులు కాలేజీని అందులోకి షిఫ్టు చేయడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు శుక్రవారం రాస్తారోకో చేశారు. అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించేదాకా ఓల్డ్ బిల్డింగులోనే తరగతులను నిర్వహించాలని హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసనకు దిగారు. స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్లు వివేక్, ఆదిత్య ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీగా వచ్చి ఆందోళన చేపట్టారు. డిగ్రీ కాలేజీ కోసం నిర్మించిన కొత్త బిల్డింగులో ఎలాంటి వసతులు లేవన్నారు.
కరెంటు, ఇంటర్నెట్, నీళ్ల సౌకర్యం లేదన్నారు. కొత్త బిల్డింగులో వసతులు కల్పించేదాకా కాలేజీని షిఫ్టు చేయవద్దన్నారు. విద్యార్థులు సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హుస్నాబాద్ ఎస్సై మహేశ్ పోలీసు సిబ్బందితో వచ్చి సముదాయించారు. అయినా కదలకపోవడంతో వివేక్, ఆదిత్యను బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వారితోపాటు ఆ సంఘం హుస్నాబాద్ నగర కార్యదర్శి రాకేశ్, ఉపాధ్యక్షుడు రాజేశ్, చరణ్, డిగ్రీ కాలేజీ కార్యదర్శి రాహుల్, అంజిరెడ్డి, శ్వేత, సౌజన్య తదితరులను సాయంత్రం దాకా అక్కడే ఉంచారు.