
నస్రుల్లాబాద్, వెలుగు : కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఘటన నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, దుర్కి, అంకోల్ తండా తో పాటు బీర్కూర్ మండలంలోని దామరంచ తదితర గ్రామాల్లో సోమవారం పలువురు కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. బాధితులను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కల్తీ కల్లు వల్ల మెడ వంకర్లు, నాలుక మొద్దు బారిందని బాధిత కుటుంబీకులు తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎక్సైజ్ సీఐ యాదగిరి గౌడ్ కు వివరణ కోరగా శాంపిల్స్ తీసుకున్నామని, విచారణ చేస్తామని తెలిపారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బాధితులను పరామర్శించి, వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.