ఏఐ క్లాసులకు ఇంటర్నెట్​ ఇబ్బందులు.. మొబైల్​ డాటా​తో తరగతుల నిర్వహణ

ఏఐ క్లాసులకు ఇంటర్నెట్​ ఇబ్బందులు.. మొబైల్​ డాటా​తో తరగతుల నిర్వహణ
  • విద్యార్థుల్లో ఆసక్తి ఉన్నా సిగ్నల్​ప్రాబ్లమ్​తో ముందుకు సాగని క్లాసులు
  • కంప్యూటర్లపై అవగాహన లేని కొందరు టీచర్లు 
  • కామారెడ్డి జిల్లాలో  27 స్కూల్స్​లో  ఏఐ క్లాసులు అమలు

కామారెడ్డి, వెలుగు :చదువులో వెనుకబడిన విద్యార్థులను ఆర్టిఫీషియల్​ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తొలి విడతగా కామారెడ్డి జిల్లాలోని 27  ప్రైమరీ స్కూళ్లను ఎంపిక చేసింది.  ఈ నెల 15 నుంచి 3, 4, 5 తరగతుల విద్యార్థులకు క్లాసులు ప్రారంభించారు. సబ్జెక్ట్​ల్లోని పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకునే వీలుంది కాబట్టి  క్లాసులు వినాని విద్యార్థుల్లో ఆసక్తి ఉన్నా ఇంటర్నెట్​ సమస్య వేధిస్తున్నది. ఎంపికైన ఏ స్కూల్​లోనూ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. వారానికి నాలుగు రోజులు  క్లాసులు ఉంటాయి. 

 తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో రోజు 20 నిమిషాల పాటు  క్లాస్ ఉంటుంది.  ఏ స్కూల్​లోనూ ఇంటర్నెట్​ లేని కారణంగా మొబైల్​ నెట్​కనెక్షన్​తో టీచర్లు తరగతులు నిర్వహిస్తున్నారు. సెల్​లో నెట్ బ్యాలెన్స్​ ఉన్నంత వరకు క్లాసులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు సెల్​ఫోన్లకు సిగ్నల్​లేక కొన్ని పాఠశాలల్లో తరగతుల నిర్వహణ అంతంత మాత్రంగానే కొనసాగుతుంది. తెలుగు పాఠాలను నేర్చుకునేందుకు, గణితంలో కూడికలు, తీసివేతలు సులువుగా నేర్చుకునే అవకాశం ఉన్నా సిగ్నల్​ ప్రాబ్లమ్​తో క్లాసులు వినలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.

 కొన్ని పాఠశాలల్లో టీచర్లకు కంప్యూటర్లపై అవగాహన లేక ఏఐ క్లాసులు అటకెక్కుతున్నాయి. ప్రస్తుతం హైస్కూళ్లలోని సిస్టమ్స్​ వాడుకోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే అకాడమీ ఇయర్​కు ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు కేటాయించేలా ప్రభుత్వానికి ప్రపోజల్​ పెట్టినట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 

ఎంపికైన ప్రైమరీ  స్కూల్స్.. 

బాన్సువాడ మండలంలో తాడ్కోల్, హన్మాజిపేట్, బొల్లారం, బీబీపేట మండలం శివార్​ రాంరెడ్డిపల్లి, బిచ్​కుంద మండలంలో జామ మసీద్, హస్గూల్, గెండె నెమ్లి, జుక్కల్​ మండలంలో హంగర్గ, లింగంపేట మండలంలో మోతె తండా, షెట్పల్లి, పొతాయిపల్లి, నస్రుల్లాబాద్ మండలంలో బొమ్మదేవునిపల్లి, మహ్మద్ నగర్​ మండలం కొమలంచ, సింగితం, నిజాంసాగర్​లో అచ్చంపేట,  రాజంపేట మండలం బసన్నపల్లి, రాజంపేట,  రామారెడ్డి మండలం మద్దికుంట, రెడ్డిపేట తండా, రామారెడ్డి,  సదాశివనగర్​లో పద్మాజివాడి, కుప్రియాల్, మర్కల్, తాడ్వాయిలో చిట్యాల్,  కన్కల్, కరడ్ పల్లి, ఎల్లారెడ్డి మండలంలో కళ్యాణి ప్రైమరీ స్కూల్స్​లో ఏఐ క్లాస్​లు నిర్వహిస్తున్నారు. ఒక్కో స్కూల్​లో  ఏఐ క్లాస్​ల కోసం 10 నుంచి 15 మంది స్టూడెంట్స్​ను సెలెక్ట్​ చేశారు.  

సమస్యలు అధిగమిస్తే ఫలితాలు.. 

ఫస్ట్​ విడతలో ఏఐ క్లాస్​ల నిర్వహణలో ఏర్పడిన సమస్యలను అధిగమిస్తే సత్పాలితాలు వస్తాయి.  ప్రైమరీ స్కూల్స్​కు కంప్యూటర్ల కేటాయించి, ఇంటర్నెట్​ కనెక్షన్​ ఇవ్వాలి. లింగంపేట మండలం మోతే తండా వంటి రూరల్​ ఏరియాల్లో సెల్​ఫోన్​సిగ్నల్స్ సైతం సరిగా రాదు.   ప్రైమరీ స్కూల్స్​ టీచర్లకు  కంప్యూటర్లపై మరింత అవగాహన పెంచాలి. 

సిగ్నల్​ సమస్యతో క్లాసులు వినలేకపోతున్నాం.. 

ఇంటర్నెట్​ లేక సెల్​ఫోన్​ నెట్​తో ఏఐ క్లాసులు చెబుతున్నారు. 4వ క్లాస్ చదువుతున్నా.   ఏఐ  క్లాస్​లతో సబ్జెక్ట్​ లు సులువుగా అర్థమవుతున్నాయి. కానీ సిగ్నల్​ ప్రాబ్లమ్​తో పూర్తి క్లాసులు వినలేకపోతున్నాం.  ‌‌‌‌‌వర్షిత, స్టూడెంట్, తాడ్కోల్​