30 దాటితే బీపీ, షుగర్ .. పెరుగుతున్న ఎన్​సీడీ పేషెంట్లు

30 దాటితే బీపీ, షుగర్ .. పెరుగుతున్న ఎన్​సీడీ పేషెంట్లు
  • 65వేల మందికి బీపీ, 27వేల మందికి షుగర్​
  • 59 మందికి క్యాన్సర్​ నిర్ధారణ
  • లైఫ్​స్టైట్, డైట్​లో మార్పులే కారణమంటున్న డాక్టర్లు
  • ఈ వ్యాధులను కంట్రోల్​చేయకపోతే కొత్త రోగాల ముప్పు  

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో బీపీ, షుగర్​బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో యాభై, అరవై ఏండ్లలో వచ్చే ఈ వ్యాధులు ఇటీవల కాలంలో 30 సంవత్సరాలు దాటగానే చుట్టుముడుతున్నాయి. నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు ఆలవాట్లలో చోటుచేసుకుంటున్న మార్పులే దీనికి కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఒక్కసారి బీపీ, షుగర్​వచ్చినట్లయితే లైఫ్​లాంగ్​మెడిసిన్​వాడుతూ ఇబ్బందులు పడాల్సిందేనని.. అంతేగాకుండా ఇవి అనేక రకాల కొత్త రోగాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. 

90 శాతం మందికి లైఫ్​స్టైల్​లో మార్పుల కారణంగానే..

ఇటీవల పెరుగుతున్న నాన్​కమ్యూనికబుల్​డిసీజ్(ఎన్​సీడీ)​లపై నేషనల్ హెల్త్​మిషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీటిని కంట్రోల్​చేసేందుకు ఎన్​సీడీ క్లినిక్​లతో పాటు అన్ని గవర్నమెంట్​హాస్పిటల్స్​లో హెల్త్​ డిపార్ట్​మెంట్​సర్వే నిర్వహిస్తోంది. మంచిర్యాల జిల్లా జనాభా 8 లక్షలు కాగా, 30 సంవత్సరాలు పైబడినవాళ్లు 4 లక్షల 62 వేల 302 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 3లక్షల 95 వేల 408 మందిని వివిధ గవర్నమెంట్ హాస్పిటల్స్​లో స్ర్కీనింగ్​చేశారు.

 ఇందులో 65 వేల 747 మందికి బీపీ(రక్తపోటు), 27 వేల 29 మందికి షుగర్(డయాబెటిస్) ఉన్నట్టు తేలింది. బాధితుల్లో 40 నుంచి 70 సంవత్సరాల లోపువారు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు గుర్తించారు. 90 శాతం మందికి లైఫ్​స్టైల్​లో మార్పుల కారణంగా, 10 శాతం మందికి మాత్రమే జెనెటికల్​గా వచ్చినట్టు తేల్చారు. బాధితులకు అన్ని సర్కారు దవాఖానాల్లో నెల వారీగా మెడిసిన్​ అందిస్తున్నామని అధికారులు తెలిపారు.   

పెరుగుతున్న క్యాన్సర్ ​పేషెంట్లు

జిల్లాలో క్యాన్సర్​ రోగుల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతున్నట్టు హెల్త్​ డిపార్ట్​మెంట్​సర్వేలో వెల్లడైంది. ఇప్పటివరకు 16 మందికి ఓరల్​క్యాన్సర్, 34 మందికి బ్రెస్ట్ క్యాన్సర్, తొమ్మిది మందికి సర్వైకల్​ క్యాన్సర్​ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. వ్యాధి తీవ్రతను బట్టి హైదరాబాద్​లోని వివిధ హాస్పిటల్స్​కు రెఫర్​చేశారు. క్యాన్సర్​ పేషెంట్ల కోసం మంచిర్యాల గవర్నమెంట్​ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)లో పాలియేటివ్​వార్డు ఉంది. మెడికల్​ ఆఫీసర్, ముగ్గురు స్టాఫ్​నర్సులు, ఫిజియోథెరపిస్ట్​ అందుబాటులో ఉన్నారు. ఇక్కడ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న పేషెంట్లకు ట్రీట్​మెంట్ ​అందిస్తున్నారు.  

బీపీ, షుగర్​కు ప్రధాన కారణాలివే..

ఉద్యోగ, వృత్తి రంగాల్లో పోటీపడి రాణించేందుకు 8గంటల కంటే ఎక్కువ టైమ్​పనిచేస్తూ ఫిజికల్​గా, మెంటల్​గా ఒత్తిడికి గురవుతున్నారు. వాకింగ్, జాగింగ్, యోగా, మెడిటేషన్, ఎక్సర్​సైజ్​లు చేయకపోవడం బీపీ, షుగర్​కు కారణమవుతోంది. అలాగే సరైన పోషకాహారం తీసుకోకపోవడం.. ఉప్పు, ఆయిల్, షుగర్​ఎక్కువగా తీసుకోవడం, జంక్​ఫుడ్​తినడం, బరువు పెరగడం (ఒబేసిటీ) వల్ల కూడా ఈ వ్యాధులు వస్తున్నాయి.

గతంలో టౌన్లలో ఎక్కువ మంది బీపీ, షుగర్​పేషెంట్లు ఉండగా, ఇటీవల పల్లెల్లోనూ బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, పోషకాలున్న ఆహారం తీసుకోవడం, జంక్​ఫుడ్​కు దూరంగా ఉండడం, రెగ్యులర్​గా యోగా, ఎక్సర్​సైజ్​లు చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.