ఎలివేటెడ్​రోడ్డు నిర్మాణానికి జియోఫిజికల్​ సర్వే

ఎలివేటెడ్​రోడ్డు నిర్మాణానికి జియోఫిజికల్​ సర్వే
  • నేషనల్ హైవే.. కూనవరం రోడ్డులో మిగులు కరకట్ట పనుల పూర్తికి చర్యలు
  • మూడు రోజులుగా బ్లూ ఎనర్జీ బిల్డ్ ప్రైవేటు లిమిటెడ్​పనులు 
  • 80 అడుగుల వరద వచ్చినా కాలనీల వైపు నీళ్లు రాకుండా నిర్మాణం  
  • ఈ ఏడాది జూన్​లోపు నిర్మాణం పూర్తి చేసేలా ప్లాన్​

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం టౌన్​లో మిగులు గోదావరి కరకట్ట నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. రూ.38కోట్ల వ్యయంతో 700 మీటర్ల పొడవున టౌన్​ చుట్టూ ఈ కట్ట పనులు జరుగుతున్నాయి. కూనవరం రోడ్డు శివారున ఈ కరకట్ట మీదుగా విజయవాడ–-జగదల్​పూర్​ నేషనల్ హైవే వెళ్లాల్సి ఉంది.  దీనిలో భాగంగా హైవేపై 13 మీటర్ల ఎత్తులో కరకట్ట వస్తున్నందున ఎలివేటెడ్​రోడ్డు 1.3కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సి ఉంది. అందుకోసం ఇరిగేషన్​ శాఖ ఇంజినీర్లు డిజైన్లు రూపొందించి ఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీకి పంపించారు. 

వారి అనుమతి కావాలంటే ఆ ప్రాంతంలో సాయిల్ టెస్ట్ చేయించాల్సి ఉంది. దీనితో మూడు రోజులుగా ఇరిగేషన్​ ఇంజినీర్లు బ్లూ ఎనర్జీ బిల్డ్ ప్రైవేటులిమిటెడ్​ కన్సల్టెన్సీ ద్వారా జియోఫిజికల్​ సర్వేను నిర్వహిస్తున్నారు. భూమి లోపల ఎంత లోతులో రాళ్లతో పొరలు ఉన్నాయి? లూజు సాయిల్​ ఏ మేర ఉంది? అనే అంశాలను స్టడీ చేస్తున్నారు.  ఆంధ్రా, ఛత్తీస్​గఢ్, ఒడిశా రాష్ట్రాలను అనుసంధానం చేసే ఈ జాతీయ రహదారిపై నిత్యం వేల టన్నుల బరువుతో వాహనాలు తిరుగుతుంటాయి. దీనితో కరకట్ట మీదుగా నిర్మించే ఈ ఎలివేటెడ్​ రోడ్డు పటిష్టంగా ఉండేలా నేషనల్ హైవేస్​ అథారిటీ జాగ్రత్తలు తీసుకుంటోంది.

80 అడుగుల వరద వచ్చినా..

గోదావరి వరదల సమయంలో భద్రాచలం వద్ద 80అడుగుల వరద వచ్చినా భద్రాచలంలోని శాంతినగర్, కూనవరం రోడ్డు, సుభాష్​నగర్​ కాలనీల వైపు నీరు రాకుండా ఉండేందుకు 700 మీటర్ల మిగులు కరకట్టను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే కరకట్ట డిజైన్​లో ఎలివేటెడ్ రోడ్డును చేర్చారు. 2025 జూన్​ నాటికి ఈ నిర్మాణం పూర్తి చేసేలా ఇరిగేషన్​ శాఖ పనులు చేపడుతోంది. ఇందు కోసం తాజాగా 2.50ఎకరాల భూమిని కూడా సేకరించారు. పాతకరకట్ట బేస్​ 53 మీటర్లు ఉండగా మిగులు కరకట్ట బేస్​ను 65 మీటర్లకు పెంచారు. కట్ట ఎత్తు గతంలో 12.50 మీటర్లుంటే ఇప్పుడ 13 మీటర్లు ఉంటుంది. ఇందు కోసం రూ.40కోట్లను వెచ్చిస్తున్నారు. 1986లో వచ్చిన 75.6 అడుగుల గోదావరి వరదను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణం డిజైన్​ను రూపొందించారు. 80 అడుగులు వరద వచ్చినా పట్టణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మళ్లీ సాయిల్​ టెస్ట్ అడిగారు

ఎలివేటెడ్​ రోడ్డు నిర్మాణం కోసం నేషనల్ హైవేస్​ అథారిటీ మళ్లీ సాయిల్​ టెస్టు అడిగారు. గతంలో ఒకసారి టెస్టు రిపోర్టు ఇచ్చాం. వాళ్లు సంతృప్తి చెందలేదు. అక్యురేటెడ్​గా కావాలని అడిగారు. అందుకే తాజాగా జియోఫిజికల్​ సర్వే నిర్వహిస్తున్నాం. రిపోర్టు ఇవ్వగానే రోడ్డు నిర్మాణ డిజైన్లకు ఆమోదం లభిస్తుంది. వెంటనే పనులు చేపడతాం.- రాంప్రసాద్​, ఈఈ, ఇరిగేషన్​ శాఖ