
భద్రాచలంలో కల్యాణ రాముడి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. సీతా సమేత శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహించారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
ముందుగా కలశాలు, ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడికి అష్టోత్తర శతనామార్చన చేశారు. పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా...పాదుకలను శ్రీరాముడికి సమర్పించారు ఆలయ పూజారులు. రాజదండం, రాజ ముద్రిక, రాజ ఖడ్గం, ఛత్రం, చామరలు, రామదాసు పచ్చల పతకం ఇలా ఒక్కోటిగా శ్రీరాముడికి అలంకరించారు. తర్వాత వైభవంగా రామచంద్రునికి కిరీటధారణ చేశారు. చివరగా వివిధ నదుల తీర్థాలతో సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారికి అభిషేకం నిర్వహించారు.