టెన్త్​ ​సెంటర్లు ఎంతో దూరం.. ఎల్లుండి నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు

టెన్త్​ ​సెంటర్లు ఎంతో దూరం..  ఎల్లుండి నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు
  • పదో తరగతి విద్యార్థుల్లో ఆందోళన
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  పరీక్ష రాయనున్న12,282  మంది

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఈ నెల 21వ తేదీ నుంచి టెన్త్​ ఫైనల్​ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12,282 మంది పరీక్షలు రాయనున్నారు. అయితే, కొన్ని హైస్కూల్స్​కు సంబంధించిన స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్​సెంటర్లు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.  ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఆటోలు, బైక్​లు, ఇతర వాహనాలపై ఎగ్జామ్స్​కు వెళ్లే  టైంలో ఏదైనా ప్రమాదానికి గురైతే తమ కష్టం వృథా అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 73 సెంటర్లు..

టెన్త్​ ఎగ్జామ్స్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి.  ఇందుకోసం జిల్లాలో 73 సెంటర్లు ఏర్పాటు చేశారు. దూరభారం వల్ల కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. పినపాకకు శాంక్షన్​అయిన జ్యోతిరావు పూలే​ గురుకుల విద్యాలయాన్ని మణుగూరులో ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడి విద్యార్థులు ఎగ్జామ్స్​ రాసేందుకు పినపాకకు వెళ్లాల్సి ఉంటుంది. 

ఇది మణుగూరు నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. టేకులపల్లి మండలంలోని గంగారం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు 15 కిలోమీటర్ల దూరంలోని బోడుకు వెళ్లాలి.  కోయగూడెం ఆశ్రమ పాఠశాల​స్టూడెంట్స్​5 కిలోమీటర్ల దూరంలోని టేకులపల్లికి, కుంటల హైస్కూల్​ స్టూడెంట్స్​5 కిలోమీటర్ల దూరంలోని బోడు ప్రాంతానికి వెళ్లి,  ఎగ్జామ్స్​రాయాలి. 

పాల్వంచ మండలంలోని ఉల్వనూర్​ బాలికల ఆశ్రమ పాఠశాల స్టూడెంట్స్ 12 కిలోమీటర్ల దూరంలోని కిన్నెరసాని ఎగ్జామ్​ సెంటర్​కు వెళ్లాలి. 

అశ్వాపురం మండలంలో ఏహెచ్ఎస్​ గొందిగూడెం స్టూడెంట్స్ 10 కిలోమీటర్లు దూరం వెళ్లి, పరీక్షలు రాయాలి.  

మైలారం హైస్కూల్​ స్టూడెంట్స్ 12 కిలోమీటర్ల దూరంలోని రేగళ్లకు వెళ్లాలి. 

పినపాక మండలంలోని దుగినేపల్లి స్టూడెంట్స్​10 కిలోమీటర్ల దూరంలోని పినపాకకు, జానంపేట స్టూడెంట్స్​8 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. 

ఇల్లెందు మండలంలోని కొమరాంర హైస్కూల్​స్టూడెంట్స్​15 కిలోమీటర్ల దూరంలోని రొంపేడుకు వచ్చి, ఎగ్జామ్స్​రాయాలి. 

ఆళ్లపల్లి మండలంలోని మార్కోడ్​స్టూడెంట్స్​10 కిలోమీటర్ల దూరంలోని ఆళ్లపల్లికి, గుండాల మండలంలోని మామకన్ను స్టూడెంట్స్​ 10 కిలోమీటర్ల దూరంలోని కాచనపల్లి వెళ్లి, పరీక్షలు రాయాలి. 

అశ్వారావుపేట మండంలోని కావడిగుండ్ల స్టూడెంట్స్​20 కిలోమీటర్ల దూరంలోని సున్నం బట్టి ఎగ్జామ్​ సెంటర్​కు, గుమ్మడివల్లి, నారాయణపురం స్టూడెంట్స్ పరీక్షలు రాసేందుకు10 కిలోమీటర్లు ప్రయాణించాలి.    

ఆర్టీసీ బస్సులు నడపాలి 

పదోతరగతి పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నడపాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల  తల్లిదండ్రులు కోరుతున్నారు. హాల్​ టికెట్​ చూపిస్తే బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసేలా చూడాలంటున్నారు. ఆంధ్రప్రదేశ్​లో టెన్త్​ స్టూడెంట్స్​కు ఈ అవకాశం ఇచ్చారని చెబుతున్నారు.  బైక్​లు, ప్రైవేటు వాహనాల్లో వెళ్తే పిల్లలు ఇబ్బంది పడతారని పేర్కొంటున్నారు. గతేడాది  కిన్నెరసానిలో జరిగిన గేమ్స్​కు అశ్వారావుపేటకు చెందిన విద్యార్థులు ట్రాలీలో వచ్చి, యాక్సిడెంట్​కు గురయ్యారని గుర్తు చేస్తున్నారు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని అంటున్నారు. 

ఇబ్బంది పడతారు..

10 నుంచి 20 కిలోమీటర్ల దూరం వెళ్లి, ఎగ్జామ్​రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడతారు. ఎండలు మండుతున్నాయి. ఆటోలు, ట్రాలీలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. 
- రాజు, యూటీఎఫ్ ​స్టేట్​ సెక్రటరీ

ఆర్టీసీ ఆఫీసర్లకు లేఖ రాశాం 

టెన్త్​ ఎగ్జామ్స్​కు  ఏర్పాట్లు చేశాం.  స్టూడెంట్స్​కోసం బస్సులు నడపాలంటూ ఆర్టీసీ ఆఫీసర్లకు లేఖ రాశాం. ఏఎన్ఎంలు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు వచ్చేలా చూడాలని వైద్యశాఖ అధికారులను కోరతాం.   
- ఎస్.మాధవరావు, పరీక్షల సహాయ కమిషనర్, భద్రాద్రి కొత్తగూడెం