
- కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
పిట్లం, వెలుగు : ప్రతి మండలంలోనూ 'భూభారతి' అవగాహన సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ అశిష్ సంగ్వాన్ తెలిపారు. సోమవారం పిట్లం, పెద్దకొడప్గల్లో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎలాంటి భూ సమస్యలున్నా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సర్వే, పెండింగ్ సాదాబైనామాల దరఖాస్తులను అధికారులు పరిష్కరిస్తారని వివరించారు. 2014 జూన్ రెండు కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమని సాదాబైనామా ద్వారా కొనుగోలుచేసి12 ఏండ్లుగా అనుభవంలో ఉంటూ12 ఆక్టోబర్ 2020 నుంచి 10 నవంబర్ 2020 మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులను ఆర్డీవోలు పరిశీలిస్తారని తెలిపారు.
గతంలో తహసీల్దార్ మ్యుటేషన్లపై అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చన్నారు. పిట్లం మీదుగా నిర్మించిన నేషనల్ హైవే 161లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా, న్యాయం చేస్తామని తెలిపారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, పిట్లం ప్రత్యేకాధికారి వామన్రావు, తహసీల్దార్ రాజనరేందర్గౌడ్, ఎంపీడీవో కమలాకర్ పాల్గొన్నారు.
రాజీవ్ యువ వికాస్ రుణాలు ఇవ్వాలి
కామారెడ్డి, వెలుగు : రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కింద బ్యాంక్లు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ సూచించారు. సోమవారం బ్యాంక్ అధికారులు, ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. మండలాల వారీగా బ్యాంకర్లకు టార్గెట్ ఇచ్చామని, త్వరితగతిన కంప్లీట్ చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ చందర్నాయక్, ఎల్డీఎం మెనేజర్ రవికాంత్, డీఆర్డీవో సురేందర్ పాల్గొన్నారు.