
- బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బినామీ: మంత్రి పొన్నం
హైదరాబాద్ , వెలుగు: హైదరాబాద్ లోకల్బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో ఒప్పందంలో భాగంగానే బీజేపీ నామినేషన్ వేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తమ పార్టీకి బలం లేకపోవడ వల్లే పోటీలో నిలవలేదని చెప్పారు. బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్.. అభ్యర్థిని పోటీలో పెట్టకుండా బీజేపీకి లోపాయికారి ఒప్పందంతో మద్దతు తెలిపిందని అన్నారు.
23 ఓట్లున్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో బీజేపీకి ఇంటర్నల్ మద్దతు ఇస్తున్నదని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ పోటీలో లేదు. మేం బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు. బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుంది? బీజేపీ, బీఆర్ఎస్ తో ఒప్పందంలో భాగంగానే బీజేపీ నామినేషన్ వేసింది. 112 ఓట్లలో బీజేపీ కేవలం 27 ఓట్లు మాత్రమే ఉన్నాయి. బీజేపీ ఎలా గెలుస్తుంది. క్రాస్ ఓటింగ్ ఎంకరేజ్ చేస్తున్నారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడికి బినామీగా వ్యవహరిస్తున్నారు” అని పొన్నం వ్యాఖ్యానించారు.