బెంగాల్​లో ఎంపీలు, ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న బోటు బోల్తా

బెంగాల్​లో ఎంపీలు, ఎమ్మెల్యే  ప్రయాణిస్తున్న బోటు బోల్తా

సూరి: పశ్చిమ బెంగాల్​లో ఎంపీలు, ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రయాణిస్తున్న స్పీడ్​ బోట్​ బోల్తాపడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ముప్పు జరగలేదు. బుధవారం బీర్భూమ్​ జిల్లా లాభ్​పూర్ ఏరియాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ టైమ్​లో బోట్​లో ప్రయాణిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ఎవరూ కూడా లైఫ్​ జాకెట్ వేసుకోకపోవడం గమనార్హం. కుయే నది కట్ట తెగిపోవడంతో లాభ్​పూర్ ఏరియాలో 15 గ్రామాలు నీటమునిగాయి. దీనిని పరిశీలించేందుకు వెళ్లిన టీఎంసీ ఎంపీలు అసిత్ మాల్, సమీరుల్ ఇస్లాం, ఎమ్మెల్యే అభిజిత్ సిన్హా, బీర్భూమ్ కలెక్టర్ బిధాన్ రే సహా 13 స్పీడ్​ బోట్ ఎక్కారు. 

ఇటీవలి వర్షాలకు కుయే నది ఉధృతంగా ప్రవాహిస్తున్నది. ఆయా గ్రామాల్లో వరద ప్రవాహం కూడా ఎక్కువగా ఉంది. ప్రవాహం మధ్యలోకి వెళ్లాక బోటు ఒక్కసారిగా బోల్తా పడింది. అక్కడే ఉన్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్​(ఎస్​డీఆర్ఎఫ్) అందరిని రక్షించింది. తర్వాత అసిత్ మాల్​ మాట్లాడుతూ ‘‘నాకు ఈత వచ్చు.. కానీ ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. దీంతో నేను ఈదలేకపోయాను. అదృష్టవశాత్తు ఒక చెట్టుకొమ్మ దొరికితే పట్టుకున్న. నేను ఎక్కువ దూరం కొట్టుకుపోలేదు” అని అన్నారు. బోటు ప్రమాదంపై జిల్లా యంత్రాంగం ఎంక్వైరీ చేపట్టింది.