బస్టాండ్​ నిండా పండ్ల బండ్లు, ఆటోలు

బస్టాండ్​ నిండా పండ్ల బండ్లు, ఆటోలు
  • ప్రయాణికులకు నిలబడే జాగా కరువు
  • బోధన్​ పాత బస్టాండ్​నిర్వహణ అధ్వాన్నం 
  • పట్టించుకొని పోలీసు, ఆర్టీసీ అధికారులు 

బోధన్, వెలుగు: బోధన్​ పాత బస్టాండ్​అధ్వాన్నంగా మారింది. పండ్లబండ్లు, ఆటోలు బస్టాండ్​లోనే నిలుపుతుండడంతో ప్రయాణికులు నిలబడేందుకు కూడా జాగా ఉండడం లేదు. ఇక్కడ నుంచి సాలూరా, బోధన్​ మండలాల్లోని గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు రోజూ వేలాది మంది వెళ్తుంటారు. పండ్లవ్యాపారులు, ఆటోవాలలతో బస్టాండ్​ నిండిపోవడంవల్ల ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డు మీద నిలబడుతున్నారు. 

బస్టాండ్​పక్కనే మున్సిపాలిటీ పండ్ల మార్కెట్ నిర్మించింది. టెండర్​నిర్వహించి షాపులను వ్యాపారులకు కేటాయించింది. బస్టాండ్​లో ఎవరూ పండ్లు అమ్మవద్దని, కాంప్లెక్స్​ లోని షాపుల్లోనే అమ్మకాలు జరపాలని అధికారులు కచ్చితంగా చెప్పడంతో కొంతకాలం పాటు బండ్లు కనిపించలేదు. క్రమంగా కొందరు వ్యాపారులు బస్టాండ్​లోని ఖాళీ జాగాల్లో తిష్ట వేసి పండ్లు అమ్మడం మొదలుపెట్టారు. దీంతో మళ్లీ బస్టాండ్​ పండ్ల దుకాణాలు, ఆటోలతో నిండిపోతోంది. బస్సుల కోసం వచ్చిన పాసెంజర్లు ఎండకు ఎండి.. వానకు తడిసే పరిస్థితి వచ్చింది. 

బస్టాండ్​లోనే కొందరు పండ్ల వ్యాపారాలు చేస్తుండడంతో మున్సిపల్​ కాంప్లెక్స్​లోని షాపుల యజమానులు ఆరు నెలలుగా మున్సిపాలిటీకి రెంట్​ కట్టలేమంటూ చేతులెత్తేశారు. బస్టాండ్​లో బండ్లు పెట్టడం వల్ల తమ దగ్గర పండ్లు కొనేందుకు ఎవరూ రావడంలేదని, గిరాకీలేక కిరాయి కట్టలేక పోతున్నామని వారు చెప్తున్నారు. బస్టాండ్​లో అమ్మకాలు అపితేనే తాము కిరాయి కడతామని తేల్చిచెప్తున్నారు. 

పాత బస్టాండ్​లో పండ్లు దుకాణాలు , అటోలు నిలపడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నా.. పోలీసు, మున్సిపల్, ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. గంటల తరబడి రోడ్లమీదే బస్సుల కోసం నిలబడడం వల్ల తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఆర్టీసీ, పోలీసు, మున్సిపల్​ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

పండ్లదుకాణాలపై చర్యలు తీసుకుంటాం 

పండ్ల వ్యాపారులు తమ షాపుల్లో కాకుండా బస్టాండ్​లో అమ్మితే చర్యలు తీసుకుంటాం. ఎక్కడిపడితే అక్కడ పండ్లు అమ్మడంతో షటర్లు తీసుకున్న వారు ఆరునెలల నుంచి కిరాయి చెల్లించడంలేదు. పోలీసు, ఆర్టీసీ అధికారుల సమన్వయంతో త్వరలోనే పండ్ల దుకాణాలు, అటోలను బస్టాండ్​ ఆవరణ నుంచి తొలగిస్తాం – మున్సిపల్​ కమిషనర్​ వెంకట నారాయణ