
ఖమ్మం, వెలుగు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఖమ్మంలో పర్యటించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో కలిసి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావును కవిత పరామర్శించారు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకోవడంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ని అడిగి తెలుసుకున్నారు.
అంతకుముందు ఇటీవల అనారోగ్యానికి గురైన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ నేత గుండాల కృష్ణ (ఆర్జేసీ కృష్ణ) ను కవిత పరామర్శించారు. కాల్వొడ్డు సమీపంలోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తర్వాత తెలంగాణ జాగృతి నాయకురాలు గట్టు అరుణ కుమారుడి రిసెప్షన్ కు హాజరయ్యారు. నూతన దంపతులు సాయి వివేక్, పావనిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, హరిప్రియ, మదన్ లాల్ పాల్గొన్నారు. ఆదివారం రాత్రి కల్లూరు మండలం లింగాలలో తెలంగాణ జాగృతి నాయకుడు దేవరపల్లి పట్టాభిరామ్ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.