
- వెలగని సెంట్రల్ లైట్లు
- పట్టించుకొని మున్సిపల్ అధికారులు..
తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ గ్రామం నుంచి మండలంలోని మహాత్మా నగర్ వరకు రాజీవ్ రహదారి సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. అటు మున్సిపాలిటీ నిర్లక్ష్యం.. ఇటు హెచ్కేఆర్కు సంబంధమే లేకపోవడంతో చీకట్లో ప్రయాణం వాహనదారులకు పరిపాటిగా మారింది. సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను మున్సిపల్శాఖ పట్టించుకోకవడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు స్తంభాలకు ఢీ కొట్టగా వాటిని తొలగించి రోడ్డు డివైడర్ మధ్యలోనో లేక రోడ్డు పక్కకు పడేస్తున్నారు.
పాడైపోయిన లైట్లను సైతం మార్చకుండా చోద్యం చూస్తున్నారు. రాజీవ్ రహదారి పర్యవేక్షిస్తున్న హెచ్కేఆర్ సంస్థ కొన్నిచోట్ల సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను నిర్వహిస్తోంది. అలుగునూర్ నుంచి మహాత్మా నగర్ వరకున్న లైటింగ్కు మాత్రం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ఏర్పాటు చేసింది.
వాటి నిర్వహణను కరీంనగర్ మున్సిపాలిటీకి అప్పగించింది. అప్పటి నుంచి హెచ్కేఆర్ సంస్థ నిర్వహణను విడిచిపెట్టగా, ప్రస్తుతం మున్సిపల్శాఖ సైతం మరమ్మతులను గాలికొదిలేసింది. అయితే రాత్రుళ్లు ప్రయాణం చేస్తున్న వాహనదారులు మాత్రం ఇప్పటికైనా అధికారులు స్పందించి సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు.