
గ్రేటర్ హైదరాబాద్ లో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో 3 హాస్పిటళ్ల నిర్మాణానికి ప్లాన్ చేసింది ప్రభుత్వం. ఉదయం 11.30 కు ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డి అన్నారంలో టిమ్స్ కు భూమి పూజ చేశారు కేసీఆర్. హాస్పిటల్ నిర్మాణ ప్లాన్ ఫొటో ఎగ్జిబిషన్ ను చూశారు. ఎల్బీనగర్ నుంచి సనత్ నగర్ వెళ్లారు కేసీఆర్. చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సనత్ నగర్ నుంచి అల్వాల్ వెళ్లి అక్కడ మరో టిమ్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మంత్రులు హరీష్ , ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ , సబితాఇంద్రారెడ్డి , సిటీ మేయర్ , ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్వాల్ లో టిమ్స్ కు భూమి పూజ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడతారు కేసీఆర్. ఇప్పటికే వీటి నిర్మాణానికి 2 వేల 679 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలు వైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖాలను నిర్మిస్తోంది సర్కార్. అల్వాల్, ఎల్బీనగర్, సనత్ నగర్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు కట్టిస్తోంది ప్రభుత్వం.
ఎల్బీనగర్ లో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం ప్రభుత్వం 900 కోట్లు కేటాయించింది. సనత్ నగర్ లో నిర్మించే దవాఖానాకు 882 కోట్లు కేటాయించింది. అల్వాల్ లో నిర్మించే ఆస్పత్రికి 897 కోట్లు అలాట్ చేసింది. గ్రేటర్ చుట్టూ నిర్మిస్తున్న మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన ప్రజలకు వైద్య సేవలు అందనున్నాయి. ముఖ్యంగా అల్వాల్-ఔటర్ రింగ్ రోడ్డు మధ్య నిర్మిస్తున్న ఆస్పత్రితో సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజలకు వైద్యసేవలు అందనున్నాయి. ఎల్బీనగర్ గడ్డిఅన్నారంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నల్లగొండ, వరంగల్, యాదాద్రి జిల్లాల ప్రజలకు ఉపయోగపడనుంది. గచ్చిబౌలిలోని టిమ్స్ తో రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ప్రజలకు ఉపయోగపడనుంది. జిల్లాల నుంచి వచ్చే ప్రజలు ఉస్మానియా, గాంధీకి వెళ్లకుండా శివారులోనే వైద్యం అందించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.