
- నియమించిన సీఎం రేవంత్ రెడ్డి
- ఇసుక ఎట్లా సప్లై చేయాలో వారంలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ అధ్యయన కమిటీ సభ్యులుగా స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్ను నియమించారు. ఈ కమిటీ వారంలోపు తమ అధ్యయనాన్ని పూర్తిచేసి సమగ్ర విధివిధానాలతో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించనున్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలో సమగ్రంగా అధ్యయనం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. రాష్ట్రంలో ఏటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి ఆదాయం ఆశించినంత రావడం లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందని సీఎం అన్నారు.
వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలని, అదే సమయంలో ప్రభుత్వానికీ ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే.. మేజర్, మైనర్ ఖనిజాల గనులకు వేసిన జరిమానాలు వసూలు కాకపోవడంపై అధికారులను సీఎం ప్రశ్నించారు. జరిమానాలు త్వరగా వసూలు చేయాలని ఆదేశించారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై సమగ్రంగా అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని అధ్యయన కమిటీని సీఎం ఆదేశించారు.