ఫిబ్రవరి 21న మహబూబ్​నగర్ జిల్లా నారాయణపేటకు సీఎం

ఫిబ్రవరి 21న మహబూబ్​నగర్ జిల్లా నారాయణపేటకు సీఎం
  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
  • రూ.966 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • జనసమీకరణపై దృష్టి పెట్టిన పేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి

మహబూబ్​నగర్, వెలుగు:అసెంబ్లీ ఎన్నికల తరువాత మొదటిసారి సీఎం హోదాలో రేవంత్​ రెడ్డి నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్​ నియోజకవర్గం ఈ జిల్లాలోనే ఉండడంతో కొత్తగా వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఇది షెడ్యూల్..​

మధ్యాహ్నం 12 గంటల నుంచి  సాయంత్రం 4 గంటల వరకు సీఎం నారాయణపేట జిల్లాలో  పర్యటిస్తారు.  ఉదయం 11.30 గంటలకు ఆయన హెలికాప్టర్​ ద్వారా బేగంపేట నుంచి బయల్దేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు విరాకాబాద్​ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకొని ఎల్లమ్మ జాతరలో పాల్గొంటారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం హెలికాప్టర్​ ద్వారా నారాయణపేట జిల్లాకు రానున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 2:10 నుంచి 3:25 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 3:40కు అప్పక్​పల్లి నుంచి హెలికాప్టర్​ ద్వారా తిరిగి హైదరాబాద్​కు బయల్దేరి వెళ్లనున్నారు.

ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు..

సీఎం నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా రూ.966 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో రూ.56 కోట్లతో నారాయణపేట గవర్నమెంట్​ మెడికల్​ కాలేజ్ అకడమిక్​ బ్లాక్​ను, రూ.26 కోట్లతో గవర్నమెంట్​ నర్సింగ్​ కాలేజ్, రూ.40 కోట్లతో వంద పడకల యూనిట్, రూ.5.58 కోట్లతో ధన్వాడ, నారాయణపేట రూరల్​ పోలీస్​ స్టేషన్లు, రూ.1.23 కోట్లతో జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించే పెట్రోల్​ బంక్​, రూ.7 కోట్లతో మరికల్​ మండల కేంద్రంలో నిర్మించిన మండల పరిషత్​ ఆఫీస్​ కాంప్లెక్స్​ బిల్డింగ్​ను పర్చువల్​గా ప్రారంభించనున్నారు.

అలాగే రూ.13 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోట్లతో నారాయణపేట గవర్నమెంట్​ కాలేజ్​ హాస్టల్​ నిర్మాణానికి, రూ.200 కోట్లతో యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్​ కాంప్లెక్స్​ నిర్మాణానికి, రూ.295 కోట్లతో తుంకిమెట్ల, నారాయణపేట రోడ్డు, కోటకొండ, మద్దూరు రోడ్డు అభివృద్ధి పనులకు, అప్పక్​పల్లి, గుండుమాల్​ రోడ్డు, మద్దూరు, లింగాల్​చెడ్​ రోడ్డులో హై లెవల్​ బ్రిడ్జిల నిర్మాణానికి, రూ.193 కోట్లతో గుల్బర్గా-కొడంగల్, రావులపల్లి–-మద్దూరు, కోస్గి–-దౌల్తాబాద్​ రోడ్డు అభివృద్ధి పనులకు, రూ.12.70 కోట్లతో నారాయణపేట నియోజకవర్గంలో సీఆర్ఆర్​ రోడ్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

ప్రతి మండలం నుంచి 5 వేల మంది..

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని అన్ని మండలాల నుంచి జన సమీకరణ చేసేందుకు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి ఏర్పాట్లు చేశారు. ఇందుకుగాను ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో ఆమె సభ సక్సెస్​ చేయడంపై మాట్లాడారు. ప్రతి మండలం నుంచి ఐదు వేల మందిని తరలించేలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకుగాను ఆయా మండలాల కాంగ్రెస్​ పార్టీ ఇన్​చార్జీలతో ఆమె ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. 

దీనికితోడు యూత్​ కాంగ్రెస్​ తరపున కూడా యువతను సభకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు లక్ష మందిని తరలించి గ్రాండ్​ సక్సెస్​ చేయాలని శ్రమిస్తున్నారు. కాగా.. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.