
వరంగల్సిటీ, వెలుగు: భద్రకాళి చెరువు పూడికతీత పనులను స్పీడప్ చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె చెరువు పూడికతీత పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. మట్టి తరలింపు తదితర విషయాలపై ఆరా తీశారు. మట్టి తరలింపునకు వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతర్గత రోడ్డు (అప్రోచ్ రోడ్డు)ను నిర్మించాలని సూచించారు.
పనులు జరుగుతున్న చోట్ల రాత్రి వేళలో లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలన్నారు. పూడికతీత మట్టి కావాలనుకునేవారు క్యూబిక్ మీటర్ కు రూ.72 చెల్లించి తీసుకోవచ్చునని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాలికల గురుకులంలో కలెక్టర్ బస
భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ భీమదేవరపల్లి మండలం వంగర డాక్టర్ పీవీ రంగారావు బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం రాత్రి కలెక్టర్ ప్రావీణ్య బస చేశారు. ఈ సందర్భంగా విద్యార్థునులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యలో రాణించాలని సూచించారు. అంతకుముందు వంట గది, సామగ్రి, భోజనాన్ని పరిశీలించారు.