
- కేసీఆర్పై కాంగ్రెస్ నేత అద్దంకి ఫైర్
హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేకనే బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కేసీఆర్ బీజేపీలో కలవడం ఖాయమన్నారు.
గతంలో బీజేపీతో చేసుకున్న ఒప్పందమే కేసీఆర్ను రాజకీయంగా ముంచిందని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీ కేసీఆర్ను ముంచబోతుందని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేసీఆర్ పరోక్షంగా బీజేపీకి సహాకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒకవేళ ఉపఎన్నికలు వచ్చినా కేసీఆర్ మాత్రం బీజేపీ కనుసన్నల్లోనే పనిచేస్తారని విమర్శించారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు కేవలం భ్రమేనని అద్దంకి పేర్కొన్నారు.