పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ చైర్​ పర్సన్​గా పురందేశ్వరి

పార్లమెంట్  మహిళా సాధికార కమిటీ చైర్​ పర్సన్​గా పురందేశ్వరి

పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ చైర్ పర్సన్​గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ కమిటీలో మొత్తం 30 మంది(20 మంది లోక్ సభ+ 10 మంది రాజ్యసభ) సభ్యులను నియమించారు. ఈ కమిటీలో  మహబూబ్​నగర్ ఎంపీ డీకే అరుణ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, సుధామూర్తి, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్ర అజిత్​  పవార్, సినీ నటి హేమామాలిని, పాత్రికేయురాలు సాగరిక ఘోష్​ తదితరులు సభ్యులుగా ఉన్నారు. 

పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ 1997లో ఏర్పాటైంది. ఇందులో లోక్​సభ నుంచి 20 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. కమిటీ చైర్ పర్సన్​ను లోక్​సభ స్పీకర్ నియమిస్తారు. సభ్యుల పదవీకాలం సాధారణంగా ఒక సంవత్సరం ఉంటుంది. 

కమిటీ లక్ష్యం

పార్లమెంట్ మహిళా సాధికారిక కమిటీ అనేది పార్లమెంట్​లో ఒక ముఖ్యమైన స్థాయీ సంఘం. ఇది మహిళల స్థితిగతులను అధ్యయనానికి, వారి సాధికారత కోసం సిఫారసులు చేయడానికి, మహిళల చట్టాలు, విధానాలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అని పరిశీలించడానికి ఏర్పాటైంది. స్త్రీల సమానత్వం, సాధికారతను సాధించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది.