
- పనుల నిర్వహణలో జాప్యం
- సర్వర్ డౌన్ అంటూ సాకులు
- చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను వేడుకుంటున్న అన్నదాతలు
లింగంపేట, వెలుగు : లింగంపేట తహసీల్దార్, సిబ్బంది తీరును నిరసిస్తూ బుధవారం పలువురు రైతులు తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. భూముల రిజిస్ట్రేషన్ల కోసం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతు లు తహసీల్దార్ ఆఫీస్కు చేరుకున్నారు. కార్యాలయ సిబ్బంది సర్వర్ డౌన్ ఉన్నందున వేచి ఉండాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తహసీల్దార్సురేష్, డిప్యూటీ తహసీల్దార్ రాందాస్ తో పాటు సిబ్బంది బయటకు వెళ్లారు. తహసీల్దార్కు ఫోన్ చేస్తే స్పందించలేదు. తహసీల్దార్ తో పాటు సిబ్బంది ఎల్లారెడ్డిలో జరిగిన ఓ ఫంక్షన్కు వెళ్లినట్లు రైతులు ఆరోపించారు.
సర్వన్డౌన్ పేరిట రెవెన్యూ ఆఫీసర్లు ,సిబ్బంది ఆఫీస్ను వదిలి వెళ్లడం ఏమిటని రైతులు ప్రశ్నించారు. రెవెన్యూ సిబ్బంది ఆఫీస్ వదిలి వెళ్లడం లింగంపేట మండల చరిత్రలో ఇదే మెదటిసారి అని రైతునాయకులు సిద్దారెడ్డి, ప్రతాప్రెడ్డి ఆరోపించారు. సాయంత్రం4.30 గంటల తర్వాత తహసీల్దార్ ఆఫీస్కు చేరుకున్నారని చెప్పారు. పది మంది రైతులకు చెందిన రిజిస్ట్రేషన్లు ఉండగా కేవలం రెండు రిజిస్ట్రేషన్లు చేసి తహసీల్దార్ వెళ్లిపోయా డని వారు ఆరోపించారు. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహసీల్దార్, సిబ్బందిపై కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.