
వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్టు పరిసర గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్ పోర్టు భూ సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. నక్కలపల్లి, గుంటురుపల్లి, నల్లకుంట, గాడిపెల్లిలో భూమి కోల్పోతున్న రైతులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు చేరుకున్న నిర్వాసిత రైతులు జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేస్తున్నారు.తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని రహదారిపై బైటాయించి నిరసనకు దిగారు
తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని డిమాండ్ చేస్తున్నారు గుంటూరు పెళ్లి, గాడిపెళ్లి రైతులు. రైతులకు మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామంటున్నారు రైతులు. సరైన పరిహారంతో పాటు తమ గ్రామాలకు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు చూపిస్తేనే సర్వే అనుమతిస్తామంటున్నారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు పోలీసులు. ధర్నాకు అనుమతి లేదని రైతులతో వాదిస్తున్నారు పోలీసులు.
వరంగల్ ఎయిర్ పోర్టుకు ఇటీవలే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఎయిర్పోర్ట్ కోసం దాదాపు వెయ్యి ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696 ఎకరాల స్థలం ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల్లో కొంత రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. భూసేకరణకు అవసరమైన నిధులను కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. మార్చిలోనే భూసేకరణను కంప్లీట్ చేయనున్నారు. నాలుగైదు నెలల్లోనే విమానాల రాకపోకలు సాగించేలా ప్లాన్ చేస్తున్నారు.