మహబూబ్​నగర్ లో నిరుద్యోగ యువతకు.. ఫ్రీ కోచింగ్ ఇయాల్టి నుంచి ప్రారంభం

మహబూబ్​నగర్ లో నిరుద్యోగ యువతకు..  ఫ్రీ కోచింగ్ ఇయాల్టి నుంచి ప్రారంభం
  • టెట్​, డీఎస్సీ, ఎస్​ఐ, కానిస్టేబుల్​, వీఆర్​ఏ, వీఆర్​వో పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అవకాశం
  • ఫస్ట్​ బ్యాచ్ లో 1,500 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మందికి ట్రైనింగ్ 
  • హైదరాబాద్​కు చెందిన  సబ్జెక్టు నిపుణులతో  శిక్షణ

మహబూబ్​నగర్​, వెలుగు: పాలమూరులో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ఫోకస్​ పెట్టారు.  రానున్న జూన్​, జులైలో టెట్​, డీఎస్సీ, ఎస్​ఐ, కానిస్టేబుల్​, గ్రూప్​-1, 2, 3, వీఆర్​ఏ, వీఆర్​వో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు  విడుదల చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో మహబూబ్​నగర్​కు చెందిన నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బుధవారం నుంచి నిరుద్యోగ యువతకు ఫ్రీ కోచింగ్​ సెంటర్​ క్లాసులను ప్రారంభిస్తున్నారు. 

వెయ్యి అప్లికేషన్లు

పోటీ పరీక్షలకు  సన్నద్ధమయ్యే యువతకు మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్​ కళాభవన్​లో బుధవారం ఉదయం పది గంటల నుంచి ఫ్రీ కోచింగ్​​ క్లాసులను ప్రారంభిస్తున్నారు. 90  రోజుల పాటు క్లాసులు ఉంటాయి.  రోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు జరుగుతాయి. రెండు రోజుల కిందట మూడు వేల అప్లికేషన్​లను రెడీ చేశారు. వాటిలో కొన్నింటిని మహిళా సంఘాల సభ్యులకు అప్పగించి, వారు నివాసం ఉంటున్న ప్రాంతంలో యువతకు అందించేలా చర్యలు చేపట్టారు.

 ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అప్లికేషన్​లను అందుబాటులో ఉంచారు.  ట్రైనింగ్​ తీసుకోవడానికి ఇంట్రెస్ట్​ ఉండే క్యాండిడేట్లు ముందుగా ఈ అప్లికేషన్​ ఫిల్​ చేయాల్సి ఉంటుంది. విద్యార్హత, ఇంటి అడ్రస్​, ఏ పోస్టు కోసం కోచింగ్​ తీసుకోవాలని అనుకుంటున్నారు,  ఆధార్, ఫోన్​ నంబరు అప్లికేషన్​లో రాసి, అప్లికేషన్​ను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు లేదా అంబేద్కర్​ కళా భవన్​లో సడ్మిట్​ చేయాలి. ఇప్పటి వరకు అప్లికేషన్​లు పంపిణీ పూర్తి కాగా.. మంగళవారం రాత్రి వరకు వెయ్యి మంది దరఖాస్తులు చేసుకున్నారు. బుధవారం ఉదయం వరకు దాదాపు రెండు వేల అప్లికేషన్​లు వచ్చే చాన్స్​ ఉంది. 

హైదరాబాద్​ ఫ్యాకల్టీతో క్లాసులు

కోచింగ్ సెంటర్​లో సబ్జెక్టులు చెప్పడానికి సబ్జెక్టు నిపుణులను  రప్పిస్తున్నారు.  హైదరాబాద్​లోని ప్రముఖ కోచింగ్​ సెంటర్లకు చెందిన ఫ్యాకల్టీ సేవలను వినియోగిస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చు ఎమ్మెల్యే యెన్నం తన సొంత నిధులు భర్తిస్తుండటంతో పాటు దాతల సహకారం తీసుకుంటున్నారు.  కోచింగ్​ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఆయా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి వేర్వేరుగా క్లాసులు చెప్పనున్నారు.  

ప్రస్తుతం అంబేద్కర్​ కళాభవన్‌‌‌‌‌‌‌‌లో  క్లాసులను స్టార్ట్​ చేస్తుండగా..  అక్కడ వెయ్యి నుంచి 1,500  మంది కెపాసిటీ ఉంది. కోచింగ్​కు వచ్చే వారు పెరిగితే అదనంగా ప్రైవేట్ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ను  అద్దెకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కోచింగ్​ సెంటర్​లో అర్థమెటిక్​, రీజనింగ్​, సోషల్​, సైకాలజీ, మెథడాలజీ, జనరల్​ స్టడీస్​, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టులతో పాటు ఎస్​ఐ, కానిస్టేబుల్​ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గ్రౌండ్​లో రన్నింగ్​, లాంగ్​ జంప్​, హై జంప్​పై శిక్షణ ఇవ్వనున్నారు.

నైపుణ్యాలను వెలికి తీసేందుకు టెస్టులు

కోచింగ్​ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  క్లాసులకు హాజరవుతున్న వారికి ఆయా పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్​ ఫ్రీగా ఇవ్వనున్నారు. కోచింగ్ 90 రోజుల పాటు ఉంటుంది. సిలబస్​ త్వరగా పూర్తి అయితే 80 రోజుల్లో క్లాసులు ముగిస్తారు. రాష్ర్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్​ రియాజ్​ కూడా ఈ కోచింగ్​ సెంటర్​లో క్లాసులు చెప్పేందుకు కూడా సిద్ధం అయ్యారు. గ్రూప్స్​, డీఎస్సీ, టెట్​, ఎస్​ఐ ఇతర పోటీ పరీక్షల్లో అర్హత సాధించి ఆయా పోస్టుల్లో ఉన్న వారితో యువతకు ప్రతి వారం మోటివేషన్​ క్లాసులు ఇప్పించనున్నారు. ఆయా సబ్జెక్టుల్లో చాప్టర్​ వారీగా వీక్లీ టెస్టులు నిర్వహిస్తారు. ఎప్పటికప్పుడు అసైన్​మెంట్లు, యూనిట్​ టెస్టులు పెట్టి, విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించనున్నారు.

కోచింగ్​లో జాయిన్​ అవుతా

మా అమ్మా, నాన్న రోజు వారీ కూలీ పనులు చేస్తూ.. మమ్మల్ని చదివిస్తున్నారు. కానిస్టేబుల్​ పోస్టులకు అప్లై చేసుకున్నా. హైదరాబాద్​లో కోచింగ్​ తీసుకోవడానికి డబ్బులు లేక ఇంట్లోనే ఉంటూ ప్రిపేర్​ అయ్యా.  ఎగ్జామ్​లో రాణించలేపోయా. ప్రస్తుతం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి పోటీ పరీక్షలు రాసే వారికి ఫ్రీ కోచింగ్​ ఇప్పిస్తున్నట్లు తెలిసింది. వెంటనే అప్లికేషన్​ పెట్టుకొని, కోచింగ్​ సెంటర్​లో జాయిన్​ అవుతా.- చందు, మణికొండ గ్రామం, మహబూబ్​నగర్​ రూరల్​ మండలం​