
మెదక్ (వెల్దుర్తి), వెలుగు: తమ భూమిని ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఫ్రీడం ఫైటర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలం మానెపల్లి గ్రామానికి చెందిన ఫ్రీడం ఫైటర్ నారాయణరెడ్డికి 1984లో అప్పటి ప్రభుత్వం మండల కేంద్రంలో సర్వే నెంబర్ 216లో 10 ఎకరాల భూమిని కేటాయించింది. 1985లో నారాయణరెడ్డి పేరు మీద ఉన్న 10 ఎకరాల భూమిని వెల్దుర్తి గ్రామానికి చెందిన కోమటిశెట్టి రమేశ్ చందర్ గుప్తా అతని సోదరుడు శ్రీనివాస్ చెరి 5 ఎకరాలు వారి పేరుపైన అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
దీంతో న్యాయం చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో కోర్టుకు వెళ్లారు. శనివారం భూమిలోకి వెళ్లగా కొమ్మిశెట్టి రమేష్ చందర్ తన అనుచరులతో దాడి చేయించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వెల్దుర్తి ఏఎస్ఐ వాసురం నాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, రమేష్ చందర్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.