
- హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, వెలుగు: ఇటీవల నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బి.ప్రశాంత్ సహా ముగ్గురు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. ‘పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోలేదు. అభ్యర్థులకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నంబర్ కూడా లేదు. ఆ నంబరు లేకుండా ఇచ్చిన ఓఎంఆర్ షీట్ ఎవరికి? ఏది? ఇచ్చారో గుర్తించడం చాలా కష్టం. వీటి తారుమారుకు వీలుంటుంది. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణ సక్రమంగా లేదు. వీటిని రద్దు చేయాలి. నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా తిరిగి పరీక్షను నిర్వహించాలి. ఇప్పటికే ప్రశ్న పత్రాలు లీకై, రద్దయ్యాయి. ఈసారి చట్ట ప్రకారం నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ నెల 13న వినతి పత్రం ఇస్తే అధికారుల నుంచి స్పందన లేదు. అందుకే హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చింది’ అని వారు తెలిపారు.