
- మహబూబాబాద్ జిల్లాకు ఆరేళ్ల బోనస్ రూ.25 కోట్లు రిలీజ్
- అనర్హుల అకౌంట్లో పడిన డబ్బులు
- గూడూరులో ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట కూలీల ఆందోళన
మహబూబాబాద్/గూడూరు, వెలుగు : తునికాకు సేకరణ బోనస్ను ప్రభుత్వం ఆరేళ్ల తర్వాత విడుదల చేయడంతో తమకు పైసలు వస్తాయని ఆశపడ్డ కూలీల ఆనందం ఆవిరైంది. తమ అకౌంట్లో పడాల్సిన వేలాది రూపాయలు అనర్హులకు దక్కడంతో ఆందోళనకు దిగారు. బోనస్ డబ్బులను తునికాకు కాంట్రాక్టర్లు, ఆఫీసర్లకు అనుకూలంగా ఉన్న వారికి ఇచ్చారంటూ బుధవారం గూడూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు.
ఒక్కో కూలీకి రూ. 20 వేల నుంచి రూ. 40 వేలు
తునికాకు కల్లం ఎంపిక టైంలో ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే కాంట్రాక్టర్లు కొన్నిసార్లు ఎక్కువ బిడ్డింగ్ నమోదు చేస్తారు. ఇలా ఎక్కువ వచ్చిన వాటిలో 25 శాతం డబ్బులను బోనస్ రూపంలో కూలీలకు చెల్లిస్తుంటారు. ఆకు మందం, క్వాలిటీ ఆధారంగా కట్టకు రూ.1 నుంచి రూ. 2 వరకు బోనస్వస్తుంది. కల్లాల వారీగా సేకరించిన కట్టల సంఖ్య, బిడ్డింగ్ టైంలో అడిషనల్గా వచ్చిన అమౌంట్ను బట్టి బోనస్ ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటుంది. కల్లం పరిధిలోని కూలీలు సేకరించిన కట్టల సంఖ్య ఆధారంగా వారి బోనస్ను నిర్ణయిస్తారు. ఇలా ఒక్కో కూలీకి రూ. 20 వేల నుంచి రూ. 40 వేల బోనస్ అందుతుంది.
ఆరేళ్లకు సంబంధించి రూ. 25 కోట్లు విడుదల
తునికాకు కల్లాల వారీగా ప్రభుత్వం తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఏటా బోనస్ ఫండ్ను రిలీజ్ చేస్తోంది. ఈ డబ్బులు 2016 నుంచి పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం ఇటీవల ఆరేళ్లకు సంబంధించిన బోనస్ ఫండ్ను విడుదల చేసింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలో 40 వేల మంది తునికాకు కూలీలు ఉండగా సుమారు రూ.25 కోట్లు మంజూరు అయ్యాయి. ఇంకా 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన బోనస్ మంజూరు కావాల్సి ఉంది. జిల్లాలోని గంగారం, బయ్యారం, కొత్తగూడ, మహబూబాబాద్, గూడూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో బోనస్ ఫండ్స్ పంపిణీలో అవకవతకలు జరిగాయని తెలుస్తోంది.
కూలీల వివరాల నమోదులో అవకతవకలు
తునికాకు సేకరణ సమయంలో కల్లం పరిధిలో ఎంత మంది కూలీలు పాల్గొన్నారు, వారికి రెగ్యులర్ పేమెంట్ ఎంత ఇచ్చారు అనే వివరాలను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలి. ఆ వివరాలను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు ఇస్తే వారు డివిజన్ ఆఫీస్ నుంచి టీఎస్ఎఫ్డీసీకి అప్ లోడ్ చేస్తారు. ఈ వివరాల ఆధారంగానే బోనస్ డబ్బులు డైరెక్టర్గా కూలీల అకౌంట్లలో పడుతాయి. ఒక్కో కూలీకి రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు బోనస్ రావాల్సి ఉంది. కానీ సెక్షన్ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కూలీల వివరాల నమోదు బాధ్యతను కాంట్రాక్టర్లు, వాన్మెన్లకు అప్పగించారు. దీంతో అవకతవకలు జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అనేక చోట్ల అనర్హుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి.
వాచ్మెన్ పిల్లలకు డబ్బులొచ్చినయ్
వేసవిలో ఎన్నో ఇబ్బందులు పడుతూ తునికాకు సేకరించాం. బోనస్ డబ్బుల కోసం 2016 నుంచి ఎదురుచూస్తున్నం. కూలీల పేర్లు పంపడంలో ఫారెస్ట్ ఆఫీసర్లు అవకతవకలకు పాల్పడ్డారు. కల్లాల వద్ద వాచ్మెన్గా పనిచేసిన వారి పిల్లల పేరిట డబ్బులు పడ్డాయి. మాకు న్యాయం చేయాలి.
- భాగ్యలక్ష్మి, తునికాకు కూలీ, కొంగర గిద్ద
అర్హులందరికీ బోనస్ ఇస్తాం
గూడూరు ఫారెస్ట్డివిజన్ పరిధిలో అర్హులైన కూలీలందరికి బోనస్ అందేలా చర్యలు తీసుకుంటాం. 2016 నుంచి 2021 వరకు గుడూరు రేంజ్ పరిధిలో 24,077 మంది కూలీలు పని చేశారు. ఎక్కడైనా అనర్హులకు డబ్బులు పడితే గ్రామ సభలు నిర్వహించి వారి నుంచి రికవరీ చేస్తాం. కూలీలు ఆందోళన చెందొద్దు.
- సురేశ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గూడూరు