
- నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్
కొల్చారం, వెలుగు: ఎమ్మెల్యే మదన్రెడ్డి అండతోనే హల్దీవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని నర్సాపూర్ మున్సిపల్చైర్మన్ ఎర్రగొళ్ల మురళీ యాదవ్ఆరోపించారు. కొల్చారం మండలం కొంగోడులో హల్దీ వాగు నుంచి ఇసుక తరలిస్తున్న టిప్పర్లను ఆదివారం బీజేపీ లీడర్లు అడ్డుకొని ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మురళీ యాదవ్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పేరుతో మూడు నెలలుగా ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు మరుగుదొడ్లు కట్టుకునేందుకు ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్తే పర్మిషన్ల పేరిట ఇబ్బందులు పెట్టే అధికారులకు వందల టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నా కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. హల్దీ వాగులో ఇసుకను ఖాళీ చేయడంతో భూగర్బ జలాలు అడుగంటి చుట్టుపక్కల ఉన్న బోర్లు వట్టిపోయాయని వాపోయారు. విషయం తెలుసుకున్న కొల్చారం ఎస్సై శ్రీనివాస్ గౌడ్అక్కడికి చేరుకోగా.. చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేశ్ గౌడ్, కౌడిపల్లి, కొల్చారం మండలా అధ్యక్షుడు రాకేష్, దయాకర్ గౌడ్, బీజేపీ కార్యకర్తలు, కొంగోడ్ గ్రామస్తులు పాల్గొన్నారు.