
- మధ్యంతర ఉత్తర్వులు జారీ.. ప్రభుత్వానికి నోటీసులు
హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం రాష్ట్ర సర్కార్ గత ఏడాది నవంబర్లో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. తదుపరి విచారణ వరకు స్టే అమల్లో ఉంటుందని ఆదేశించింది. రెండు భూసేకరణ నోటిఫికేషన్ల అమలును నిలివేస్తూ ఆదేశాలు వెలువరించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో 110.32 ఎకరాలు, హకీంపేటలో 351.10 ఎకరాల చొప్పున భూసేకరణకు 2024 నవంబర్లో ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను గురువారం హైకోర్టు విచారించారు. తదుపరి విచారణ వరకు భూసేకరణ నోటిఫికేషన్ల అమలును నిలిపవేయాలని, ఈ వ్యవహారంలో ముందుకు వెళ్లరాదని అధికారులను ఆదేశించారు.
కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, వికారాబాద్ జిల్లా కలెక్టర్, లగడర్ల ఆర్డీవో, దుద్యాల తహసీల్దార్, టీఎస్ఐఐసీలకు నోటీసులు ఇచ్చారు. మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు కోసం హకీంపేటలో 351.10 ఎకరాలకు ఇచ్చిన నోటిఫికేషన్ను కుమ్మరి శివకుమార్, లగచర్లలో 110.32 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను పి.గోపాల్ నాయక్ మరో 15 మంది రైతులు హైకోర్టులో సవాలు చేశారు. వాళ్ల తరఫున సీనియర్ అడ్వొకేట్లు బీఎస్ ప్రసాద్, వి.రఘునాథ్ వాదిస్తూ, పారిశ్రామికవాడ నిమిత్తం ప్రభుత్వం 1,177 ఎకరాలకు పైగా భూసేకరణ చేపట్టడానికి రాష్ట్రం నిర్ణయించిందని చెప్పారు.
1,177 ఎకరాల్లో.. 534 ఎకరాలు ప్రభుత్వానికి చెందినది మినహా లగచర్లలో 110 ఎకరాలు, హకీంపేటలో 351 ఎకరాలు సేకరించడానికి నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు. ఇండస్ట్రియిల్ పార్క్కు ఎంత భూమి అవసరం, ఎందుకు ఆ పార్కు ఏర్పాటు చేస్తున్నారు, దాని లక్ష్యం ఏమిటి, అందులో ప్రజావసరం ఏముంది.. వంటి వివరాలు లేకుండానే నోటిఫికేషన్ ఇవ్వడం చెల్లదన్నారు. ఇది రాజ్యాంగ, చట్ట విరుద్ధమని చెప్పారు. సామాజిక ప్రభావ స్టడీ, ప్రజాభిప్రాయ సేకరణ, మార్కెట్ విలువ మొదలైనవి నిర్ణయించకుండా భూ సేకరణ ప్రక్రియ చేపట్టడం చెల్లదన్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా భూసేకరణ ప్రక్రియ ఉందన్నారు. వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.
ఎక్కువమంది రైతుల ఆమోదం ఉంది: ప్రభుత్వం
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, రైతులకు తగిన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. ఒక్కో ఎకరానికి రూ. 20 లక్షల పరిహారంతోపాటు 150 గజాల ఇంటి జాగా, ఇందిరమ్మ స్కీం కింద ఇంటి నిర్మాణ సాయం, అర్హులకు ఉద్యోగ కల్పన వంటి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు ఎక్కువ మంది రైతులు ఆమోదం చెప్పారన్నారు.
ఇరుపక్షాల వాదనల తరువాత న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేశారు. అప్పటి వరకు భూసేకరణ నోటిఫికేషన్ల అమలు నిలిపివేత ఉత్తర్వుల అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.