న్యూఢిల్లీ: రోడ్లు సరిగా లేకుంటే హైవే ఏజెన్సీలు టోల్ వసూలు చేయరాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదువేల కిలోమీటర్ల రోడ్ల కోసం అమలు చేయనున్న ఉపగ్రహ ఆధారిత టోలింగ్పై ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. "మీరు మంచి నాణ్యమైన సేవను అందించకపోతే టోల్ వసూలు చేయకూడదు.
ఉత్తమ నాణ్యత గల రోడ్డును అందించే చోట మాత్రమే మీరు డబ్బులు వసూలు చేయాలి. గుంతలు, బురద ఉన్న రోడ్లపై టోల్ వసూలు చేస్తే ప్రజల నుంచి ఎదురుదెబ్బ తగులుతుంది" అని అన్నారాయన. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్)- ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) సిస్టమ్ను ఇప్పటికే ఉన్న ఫాస్ట్ట్యాగ్ పర్యావరణ వ్యవస్థలో అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ యోచిస్తోంది. గోప్యతా సమస్యలను పరిగణనలోకి తీసుకుని మొదట్లో ప్రైవేట్ వాహనాలపై, వాణిజ్య వాహనాలపై దీన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది.