- సరుకులు అవసరం ఉన్నోళ్లు వచ్చి తీస్కెళ్లండి
లక్నో: ‘ఇంటింటికీ తిరిగి సరుకులు అందించడానికి మేమేం జొమాటో సర్వీస్ చేయట్లేదు.. అవసరమున్నోళ్లు పునరావాస కేంద్రానికి వచ్చి సరుకులు తీస్కోండి’ అంటూ వరదబాధితులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్ జిల్లా కలెక్టర్ ఈ వివాదాస్పద కామెంట్లు చేశారు. ఇటీవలి వర్షాలకు యూపీలోని పలు జిల్లాలు జలమయం అయ్యాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను అలర్ట్ చేశారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నతాధికారులు పర్యటిస్తూ బాధితులకు సాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ నగర్ కలెక్టర్ శామ్యూల్ పాల్అధికారులతో కలిసి వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
అంబేద్కర్నగర్లోని ఓ పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించిన సమయంలో రికార్డుల్లో చూపిన సంఖ్య కన్నా జనం తక్కువగా ఉన్నారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్.. పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసిందే బాధితుల కోసమని, అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పారు. ఓ డాక్టర్ కూడా అందుబాటులో ఉండి అవసరమున్నోళ్లకు వైద్యం చేస్తారని వివరించారు. ఉదయంపూట బాధితులందరూ ఒక్కచోట చేరి, ఆ రోజు ఎంతమందికి ఏ టైముకు ఆహారం అవసరమో నిర్వాహకులకు చెప్పాలని సూచించారు. అవసరమున్నోళ్లు కేంద్రానికే వచ్చి ప్రభుత్వం అందించే సాయం పొందాలని, ఇంటింటికీ తిరిగి సరుకులు అందజేయడానికి ప్రభుత్వమేమీ జొమాటోను నడపట్లేదని కలెక్టర్ పాల్ తేల్చిచెప్పారు. ఉదయం పూట ఉన్నోళ్లకు మాత్రమే సరిపడా ఆహారం తయారుచేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతుండగా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది.