![సొంతింటి కలకు అడుగులు డెమో ‘ఇందిరమ్మ ఇల్లు’ సిద్ధం](https://static.v6velugu.com/uploads/2025/02/indiramma-illu-scheme-houses-for-the-poor-in-45-yards_pvybzflVtM.jpg)
- 45 గజాలలో ఇంటి నిర్మాణం
- మొదటి విడతలో సొంత జాగా ఉన్న వారికే అవకాశం
- అర్హుల గుర్తింపు తర్వాత నిర్మాణాలపై అవగాహన కార్యక్రమం
మహబూబ్నగర్, వెలుగు: పేదల సొంతింటి కలకు అడుగులు పడుతున్నాయి. జనవరి 26 నుంచి ‘ఇందిరమ్మ ఇల్లు’ స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించగా.. త్వరలో సొంత జాగా ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు సర్కారు సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక డెమో ‘ఇందిరమ్మ ఇల్లు’ నిర్మాణం చేపడుతున్నారు. మహబూబ్నగర్ నిమోజకవర్గంలోని మహబూబ్నగర్ రూరల్ మండలం ఓబులాయపల్లి గ్రామానికి చెందిన గొల్ల వీరయ్య తన సొంత జాగలో ఇంటిని నిర్మించుకున్నాడు. దీనిని డెమోగా చూయిస్తూ.. ఈ నిర్మాణం ప్రకారం నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నారు. అర్హుల గుర్తింపు పూర్తయిన తరువాత వారికి ఈ నిర్మాణం ఎలా ఉంటుంది? ఎన్ని గజాలలోపు నిర్మించుకోవాలనే దానిపై హౌసింగ్ ఆఫీసర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
45 గజాల్లో ఇంటి నిర్మాణం..
ఇందిరమ్మ ఇంటిని 45 గజాల్లో నిర్మించేలా డిజైన్ చేశారు. ఇంటి లోపల ఒక బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్, ఒక హాల్, కిచెన్ ఉంటాయి. ఇంటి బయట ఒక బాత్రూమ్ ఉండేలా ప్లాన్ చేశారు. ఇంటికి రెండు వైపులా రెండు దర్వాజాలు, వెంటిలేషన్ ఎక్కువగా రావడానికి హాల్లో రెండు కిటికీలు, కిచెన్లో ఒకటి, బెడ్రూమ్లో ఒక కిటికీని అమర్చారు. కిచెన్లో సింక్ విత్ పైప్లైన్ ఏర్పాటు చేశారు.
వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్ను ఏర్పాటు చేయగా.. దాని ద్వారా కిచెన్, బాత్రూమ్కు కనెక్షన్ ఇచ్చారు. ఇదే తరహాలో నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాల్సి ఉంటుంది. 45 గజాలకు కాకుండా 70 గజాల నుంచి 75 గజాల స్థలం ఉంటే లబ్ధిదారులు కాంపౌండ్ వాల్ నిర్మించుకోవచ్చు.
కొనసాగుతున్న వివాదాలు..
గత ప్రభుత్వ హయాంలో మహబూబ్నగర్ నియోజకవర్గంలో పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగాయి. దీనిపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. లక్కీ డిప్ ద్వారా కాకుండా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు ఒక్కో ఇంటిని అమ్ముకున్నట్లు ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కాంగ్రెస్ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఎంక్వైరీకి ఆదేశించింది.
దీనిపై మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఇటీవల విచారణ చేసిన రెవెన్యూ ఆఫీసర్లు అక్రమాలను గుర్తించారు. స్థానికులకు కాకుండా స్థానికేతరులు ఇండ్లను విక్రయించినట్లు తేల్చారు. వెయ్యి ఇండ్లకు పైగా అనర్హులకు కట్టబెట్టినట్లు సమాచారం. అలాగే జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్లలోనూ అక్రమాలు జరిగినట్లు విమర్శలున్నాయి. దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా.. ఈ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఫొటో పెడితేనే పేమెంట్లు..
ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో ఖాళీ జాగ ఉన్న వారికి ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే పంచాయతీ సెక్రటరీలు నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. స్కీం కింద బేస్మెంట్, స్లాబ్, వాల్స్, ఫైనల్ పేమెంట్ ద్వారా మొత్తం నాలుగు విడతల్లో రూ.5 లక్షలు మంజూరు కానున్నాయి. ఈ నాలుగు దశల్లో ప్రతి దశకు సంబంధించిన ఫొటోను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే పేమెంట్ మంజూరవుతుంది. ఫొటోలు అప్లోడ్ చేయకుంటే పేమెంట్కు బ్రేక్ పడుతుంది. అలాగే ఒక చోట మంజూరు వచ్చి.. మరో చోట నిర్మాణం చేపట్టినా పేమెంట్లు ఆగిపోతాయి.
గత సర్కారు మంజూరు చేసిన ఇండ్ల వివరాలు..
జిల్లా మంజూరైనవి పూర్తైనవి
మహబూబ్నగర్ 8,768 4,321
నారాయణపేట 2,017 00
నాగర్కర్నూల్ 5,500 320
వనపర్తి 3,835 1,203
గద్వాల 2,070 580