
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామలో నిషేధిత జాబితాలో ఉన్న అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం చేసిన రిజిస్ర్టేషన్లను రద్దు చేయాలని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొల్కూరి నర్సింహారెడ్డి కలెక్టర్ను కోరారు. బుధవారం అన్ని ఆధారాలతో కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పటాన్చెరులో ఆయన మాట్లాడుతూ నందిగామ సర్వే నంబర్ 213 లోని ఐదు ఎకరాల అసైన్డ్ భూములను 2020 లో అక్రమంగా రిజిస్ర్టర్ చేసుకున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ సోదరుడు అరుణ్కుమార్, అతడి స్నేహితుల పేరుపై నిబంధనలకు విరుద్ధంగా భూ బదలాయింపులు చేశారని, బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అసైన్డ్ చట్టం 1977 ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఎలా రిజిస్ర్టర్ చేశారని ఆయన అధికారులను ప్రశ్నించారు.
స్థానిక బీసీలకు చెందిన అసైన్డ్ భూములను రాజకీయ పలుకుబడితో కాజేశారని, బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారి భూములు వారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నందిగామ భూముల విషయంలో ఈనెల 18 న హైకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని వెంటనే అక్రమ రిజిస్ర్టేషన్లు రద్దు చేయాలని కోరారు. గతంలో భూములను అనుభవించిన రైతులకే తిరిగి హక్కులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.