![గిరి బిడ్డల ఉన్నతికి విద్యాసంస్థల్లో మాస్టర్ ప్లాన్ : ఐటీడీఏ పీవో రాహూల్](https://static.v6velugu.com/uploads/2025/02/itda-po-b-rahul-launches-career-guidance-program-for-tribal-students_gDFBMYfIty.jpg)
- ఐటీడీఏ పీవో రాహూల్
భద్రాచలం, వెలుగు : గిరిజన విద్యా సంస్థల్లో చదువుతున్న గిరిజన స్టూడెంట్స్కు మంచి భవిష్యత్ అందించడమే లక్ష్యాంగా మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తున్నామని ఐటీడీఏ పీవో బి. రాహూల్ పేర్కొన్నారు. భద్రాచలం పట్టణంలోని ఏబీహెచ్ఎస్ బాలికల ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన కేరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ను రాహూల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేస్తున్న గిరిజన విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వైఫల్యం చెందుతున్నారన్నారు.
గిరిజన బిడ్డల ఉన్నతి కోసం గిరిజన విద్యా సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సూచిస్తూ రూపొందించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారితో కెరీర్ గైడెన్స్లో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నామన్నారు. ప్రతి స్కూల్ నుంచి ఐదుగురు స్టూడెంట్స్ను సెలెక్ట్ చేసి ఈనెల 23న జరిగే ప్రతిభా ప్రోత్సాహక పరీక్షకు పంపనున్నట్టు తెలిపారు. ఈ ప్రోగ్రామ్లో సహాయ ప్రాజెక్ట్ అధికారి జనరల్ డేవిడ్రాజ్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు మణెమ్మ, విజయలక్ష్మి, ఎసీఎంవో రమణయ్య పాల్గొన్నారు.