పదవీ విరమణ తర్వాత.. తీర్పులు సరికాదు

పదవీ విరమణ తర్వాత.. తీర్పులు సరికాదు

కోర్టులు తీర్పులని  తగు కారణాలతో,  సకాలంలో  వెలువరించాలి.  ఆ విధంగా  వెలువరించినప్పుడే కోర్టుల మీద విశ్వసనీయత పెరుగుతుంది. తగు కారణాలు చెప్పకుండా తీర్పులను ప్రకటించడం మానివేయాలని సుప్రీంకోర్టు తరుచూ చెబుతోంది.  కానీ, హైకోర్టు న్యాయమూర్తులు ఈ విషయాలను అంతగా పట్టించుకున్నట్లు అనిపించడం లేదు. ఈ మధ్య  మద్రాస్​ హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించిన రెండు తీర్పులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 

మద్రాస్​ హైకోర్టు  న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తరువాత తీర్పుని విడుదల చేశారన్న ఏకైక కారణంగా.. మద్రాస్​ హైకోర్టు న్యాయమూర్తి  వెలువరించిన తీర్పుని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 2024లో రద్దు చేసింది. ఒక న్యాయమూర్తి  పదవీ విరమణ చేసిన తర్వాత ఫైలు తన దగ్గర ఉంచుకోవడం అనుచితమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు  అభయ్ ఎస్​ ఓకా,  ఉజ్వల్​ భుయాన్​లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ కేసుని తిరిగి విచారించమని  మద్రాస్​ హైకోర్టుకు తిప్పి పంపింది.  ఈ కేసులో మద్రాస్​ హైకోర్టు న్యాయమూర్తి ఒకే ఒక వాక్యంతో 17 ఏప్రిల్​ 2017న ప్రకటించారు. ఆ న్యాయమూర్తి  26 మే 2017న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత పూర్తి తీర్పుని వివరణాత్మకంగా 23 అక్టోబర్ 2017న విడుదల చేశారు. అంటే, పదవీ విరమణ తరువాత ఐదు నెలలకి పూర్తి తీర్పు పాఠం అందుబాటులోకి వచ్చింది. ఈ తీర్పుని సీబీఐ.. సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పదవీ విరమణ చేసిన తర్వాత తీర్పును ప్రకటించారన్న కారణాన్ని సీబీఐ.. సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా పేర్కొంది.  ఈ కేసులో ( స్టేట్​ త్రూ సీబీఐ వర్సెస్​ నరేష్​ ప్రసాద్​ అగర్వాల్​, 2024 లైవ్​లో (సుప్రీంకోర్టు. 133)​ హైకోర్టు న్యాయమూర్తి వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు విమర్శనాత్మకంగా తీసుకుని ఈ విధంగా వ్యాఖ్యానించింది..  ‘పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆ న్యాయమూర్తి కారణాలు రాసి తీర్పును సిద్ధం చేశారు. 5నెలల పాటు ఆ కేసు ఫైలును ఆ విధంగా ఉంచడం అనుచితమైన చర్య. ఈ కేసులో ఏం జరిగి ఉంటుందో  మేం లెక్కపెట్టదల్చుకోలేదు’ అని పేర్కొంది.

న్యాయం జరిగినట్టు అన్పించాలి

‘న్యాయం జరగడమే కాదు.  జరిగినట్టు కూడా అన్పించాలని’ లార్డ్​ హెవార్ట్  వంద సంవత్సరాల క్రితం చెప్పాడు. అతను చెప్పినదానికి విరుద్ధంగా ఈ కేసులో జరిగింది. ఇలాంటి అనుచిత చర్యలను మేం సమర్థించలేం. ఈ తీర్పును రద్దు చేసి తిరిగి తాజా నిర్ణయం కోసం హైకోర్టుకి పంపించడమే మాకు అందుబాటులో ఉన్న అంశం’.  కేసుని మద్రాస్​ హైకోర్టుకి తిప్పి పంపిస్తూ ఈ కేసులోని ‘యోగ్యతలని మేం పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. 

న్యాయమూర్తి రెండో తీర్పు

ఈ న్యాయమూర్తి వెలువరించిన మరో తీర్పుని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్​ అభయ్​ ఓకా, జస్టిస్​ అగస్టీన్​ జార్జి మసీహ్​లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ కేసులో హైకోర్టు సింగిల్​జడ్జి సింగిల్​ లైన్​ జారీ చేశారు. ఆ న్యాయమూర్తి పదవీ విరమణ చేసేవరకు వివరణాత్మక తీర్పు అందుబాటులోకి రాలేదని సీబీఐ వాదన చేసింది. ఈ విషయం మీద నివేదికను సమర్పించాలని మద్రాస్​ హైకోర్టు రిజిస్ట్రార్​ జనరల్​ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈక్రమంలో ఈ కింది సమాచారాన్ని అందించాలని రిజిస్ట్రార్​ని  సుప్రీంకోర్టు ఆదేశించింది. 

1. ఆ న్యాయమూర్తి నుంచి వివరణాత్మకమైన
 తీర్పు రిజిస్ట్రీకి ఎప్పుడు అందింది? 
2. ఆ వివరణాత్మకమైన తీర్పుని ఎప్పుడు అప్​లోడ్​చేశారు?
3. ఆ న్యాయమూర్తి విచారించిన 9 కేసుల్లో తిరిగి విచారించాలని మద్రాస్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమైనా పరిపాలనా ఆదేశాలు జారీ చేశారా?ఒకవేళ ఉంటే ఈ సుప్రీంకోర్టు ముందు ఉన్న ఎస్​ఎల్​పీలో ఉన్న అంశం ఆ  కేసుల్లో ఉందా? తదితర అంశాలపై సమాచారం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఆదాయపు పన్ను అధికారి కేసు..

ఇక, ఈ కేసు విషయంలోకి వస్తే.. ఈ కేసులోని ముద్దాయి 1999వ బ్యాచ్​కి చెందిన ఆదాయపు పన్ను అధికారి. అతను ఆదాయపు పన్ను అదనపు కమిషనర్​గా పనిచేస్తున్నాడు. అతను అక్రమాస్తులు సంపాదించాడన్న ఆరోపణలతో అతనిపై కేసుని నమోదు చేశారు. ఆయన, అతని భార్య అక్రమాస్తులు కూడబెట్టినారని ఆ ఎఫ్ఐఆర్​లో ఆరోపణ. హైకోర్టు వెబ్​సైట్​లో ఉన్న తీర్పు ప్రకారం.. వ్యక్తిగత పగతో,  దురుద్దేశంతో అతనిపై విచారణని ప్రారంభించినట్లు కనిపిస్తుందని హైకోర్టు భావించి ఎఫ్ఐఆర్​ని రద్దు చేసింది.  15 మే 2017న సింగిల్​ లైన్ తీర్పుని ఆ న్యాయమూర్తి  ప్రకటించారని సీబీఐ  సుప్రీంకోర్టులో పేర్కొంది.  అదేరోజు  తీర్పు ప్రతికోసం తాము దరఖాస్తు చేశామని అయితే వివరణాత్మక తీర్పు రాలేదని తమకు మౌఖికంగా రిజిస్ట్రీ తెలియజేసిందని సీబీఐ సుప్రీంకోర్టుకి తెలియజేసింది. ఆ హైకోర్టు న్యాయమూర్తి 26 మే 2017న సీబీఐకి హైకోర్టు రిజిస్ట్రీఅందించింది. పదవీ విరమణ చేసేంతవరకు ఆ న్యాయమూర్తి తగు కారణాలని చూపించలేదన్నది సీబీఐ వాదన.  సీబీఐ ప్రకారం ఆ న్యాయమూర్తి విచారించిన తొమ్మిది  కేసుల్లో మళ్లీ విచారణ మద్రాస్​ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయని సుప్రీంకోర్టు దృష్టికి సీబీఐ తీసుకువచ్చింది.  ఈ కేసులోని విషయాల గురించి మద్రాస్​ హైకోర్టు రిజిస్ట్రార్​జనరల్ ​నుంచి తీసుకుని  తమ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 

పదవీ విరమణ తర్వాత తీర్పులు..

పదవీ విరమణ తరువాత తీర్పులను ప్రకటించడమనేది ఒక్క మద్రాస్​ హైకోర్టుకే పరిమితం కాలేదు.  గతంలో అలహాబాద్​  హైకోర్టు సురేంద్ర ప్రభాస్​ వర్సెస్​ విశ్వరాజ్​ సింగ్​ కేసులో ఇదేవిధంగా జరిగింది. 2020వ సంవత్సరంలో బాలాజీ బలరాం వర్సెస్​ స్టేట్​  ఆఫ్​ మహారాష్ట్ర కేసులో ఇదేవిధమైన జాప్యం జరిగింది.  గత జూన్​లో ఇలాంటి సంఘటనలు కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి వచ్చి ఆయన కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు.  పదవీ విరమణ చేసిన తరువాత న్యాయమూర్తులు తమ చాంబర్లను ఉపయోగించుకోకూడదు. న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన మూడురోజుల్లో కేసు రికార్డుని రిజిస్ట్రీకి ఆ న్యాయమూర్తి సిబ్బంది అందజేయాలి. పదోన్నతి పొందిన న్యాయమూర్తులు, బదిలీ అయిన న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి అనుమతితో తమ చాంబర్లని ఉపయోగించుకోవచ్చు. న్యాయమూర్తులు తమ తీర్పులను సంతకాలు చేసి అదేరోజు అందజేయాలి. అది ఆ అర్ధరాత్రికి మించడానికి వీల్లేదు. జిల్లా జ్యుడీషియరీకి మార్గదర్శకత్వం వహించాల్సిన హైకోర్టు న్యాయమూర్తులు  సింగిల్​ లైనులో తీర్పులు ప్రకటించడం, పదవీ విరమణ తరువాత లేదా ఆలస్యంగా తీర్పులను ప్రకటించడం ఎంతవరకు సమంజసం?  ఇలాంటి న్యాయమూర్తుల మీద సుప్రీంకోర్టు ఏమైనా చర్యలు తీసుకోగలదా.. కష్టమే.

- డా. మంగారి రాజేందర్​
జిల్లా జడ్జి (రిటైర్డ్​)