
కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపై కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ఇవాళ హనుమకొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయనతో పాటు ఎంపీ సీతారాంనాయక్, ఎంపీ పసునూరి దయాకర్ ఇందులో పాల్గొన్నారు. అసమానతలను పెంచేలా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని కడియం మండిపడ్డారు. దళిత మేధావులు, ప్రజా స్వామ్యవాదులు అప్రమత్తం కావాలన్నారు. కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని విమర్శించారు. ఆహారపు ఆలవాట్లను కూడా నియంత్రణ చేస్తున్నారని ఆరోపించారు. 1961 నుంచి 2021 వరకు అరవై ఏళ్లలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కేంద్రం పెంచలేదన్నారు.
.
దేశ జనాభాలో ఎస్సీలు18 శాతం, ఎస్టీలు 10 శాతం ఉన్నారని.. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో అంబేద్కర్ ఇచ్చిన దళితుల హక్కులను కాలరాయొద్దని కోరారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్రప్రభుత్వం విఫలమైందని తెలిపారు.
60 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచకపోవడంపై RSS కుట్ర ఉందని మాజీ ఎంపీ సీతారాంనాయక్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. యాభై శాతం కంటే ఎక్కువైనా ప్రత్యేక చట్టం ద్వారా రిజర్వేషన్లు పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దళితులపై వివక్ష చూపుతోందని ఎంపీ పసునూరి దయాకర్ మండిపడ్డారు. బండి సంజయ్ మసీదులను కూలగొట్టాలంటుండు..సంజయ్ కు బుద్ధుందా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు యువతను వక్రమార్గంలో తీసుకెళుతున్నారని విమర్శించారు.