
జనగామ/ స్టేషన్ఘన్పూర్, వెలుగు : వచ్చే 15 నెలల్లో దేవాదుల పెండింగ్పనులు పూర్తయ్యేలా అధికారులు పనిచేయాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం జనగామ కలెక్టరేట్ లో కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్తో కలిసి ఇరిగేషన్శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో రివ్యూ నిర్వహించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సాగునీరు అందించనున్నామని, పెండింగ్పనుల పూర్తికి కలెక్టర్, ఇరిగేషన్సీఈ ప్రతి నెల రివ్యూ చేపట్టాలన్నారు.
నీటి పారుదల శాఖ అధికారులకు కనీస అవగాహన లేదని అసహనం వ్యక్తం చేశారు. మల్లన్నగండి లిఫ్ట్–1, లిఫ్ట్–2 పనులు జులైలోగా, అశ్వరావుపల్లి ప్రధాన కుడి కాల్వ పనులు డిసెంబర్ లోగా పూర్తి కావాలన్నారు. ఆర్ఎస్ ఘన్పూర్ నుంచి నవాబుపేట రిజర్వాయర్ ప్రధాన కాల్వ సీసీ లైనింగ్పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ధర్మసాగర్ సౌత్ మెయిన్ కెనాల్, నక్కల తూము పనులు పూర్తి చేయాలన్నారు. దేవాదుల పనులన్నింటినీ పూర్తి చేసేందుకు అధికారులు సహకరించాలని కోరారు.
పేదల పక్షపాతి సీఎం రేవంత్రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం స్టేషన్ఘన్పూర్ పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఆయన పర్యటించి, తాటికొండ యాదమ్మ ఇంట్లో రేషన్ద్వారా అందుకున్న సన్నబియ్యం భోజనం కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ రోహిత్సింగ్తో కలిసి తిన్నారు. కాగా, స్థానిక బస్టాండ్సమీపంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు నీల వేంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు ఆర్ఆర్ యూ కంగన్హాల్, గార్మెంట్స్షాపును ఎమ్మెల్యే ప్రారంభించారు. అక్కడ పటాకులు కాల్చడంతో షామియానా పై పడి మంటలు చెలరేగాయి. అక్కడున్న వారు నీళ్లు చల్లి మంటలు ఆర్పేశారు. స్టేషన్ఘన్పూర్మండలం ఇప్పగూడెంలో పెద్దమ్మతల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి ఎమ్మెల్యే కడియం హాజరై మొక్కులు చెల్లించారు. ముదిరాజ్ సంఘం నాయకులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.