
కామారెడ్డిటౌన్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో వడ్ల కొనుగోళ్లపై నిర్వహించిన మీటింగ్లో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి 6 లక్షల 20వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే వీలుందని, సెంటర్లలో అమ్మకానికి 5 లక్షల 63 వేల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తాయన్నారు. 446 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరి కోతలు షూరు అయిన ఏరియాల్లో వెంటనే కొనుగోలు సెంటర్లు తెరవాలన్నారు.
సెంటర్లలో సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తాగునీటి సౌకర్యంతో పాటు ఓఆర్ఎస్ ఫ్యాకెట్లను కూడా ఉంచాలన్నారు. కాంట అయిన వెంటనే ట్యాబ్లో ఎంట్రీ చేయాలని సూచించారు. 24 గంటల్లోగా రైతుల అకౌంట్లలో డబ్బులు పడేలా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లికార్జునబాబు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాస్రెడ్డి, అగ్రికల్చర్ అధికారి తిరుమల ప్రసాద్, మార్కెటింగ్ అధికారిణి రమ్య, ఐకేపీ, సింగిల్ విండో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.