
- కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే: చనగాని దయాకర్
హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూముల వివాదానికి సంబంధించిన ఏఐ వీడియోలు, ఫొటోలు బీఆర్ఎస్ భవన్ కేంద్రంగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆరోపించారు. కేటీఆర్ డైరెక్షన్లో కొణతం దిలీప్, క్రిశాంక్ వీటిని రూపొందించారన్నారు. గాంధీ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కంచ గచ్చిబౌలి భూములపై వివిధ రంగాల సెలబ్రెటీలు స్పందించడానికి, వాళ్లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఈ ఫేక్ ఫొటోలు, వీడియోలు పెట్టుకోవడానికి కేటీఆర్ ప్రోద్బలమే కారణం.
కంచ గచ్చిబౌలి భూములు ముమ్మాటికీ ప్రభుత్వానివే. అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హెచ్సీయూ స్టూడెంట్లను కేటీఆర్ రెచ్చగొడ్తున్నారు. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా రేవంత్ సర్కార్ పని చేస్తుంటే.. బీఆర్ఎస్ లీడర్లు మాత్రం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకుండా కుట్ర చేస్తున్నారు. త్వరలోనే నిరుద్యోగ యువత కేటీఆర్ తీరుకు వ్యతిరేకంగా తిరుగుబాటు ర్యాలీ చేస్తారు’’ అని దయాకర్ అన్నారు.