
- ఫార్ములా ఈ రేస్ కూడా అందుకు కారణం: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ ఫలితంగానే ఇప్పుడు రాష్ట్రంలో బీవైడీ సంస్థ కార్ల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నదని ఆ పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ అన్నారు. వెయ్యి కోట్ల డాలర్లతో పెట్టుబడులు పెట్టేందుకు 2022–23లోనే తమ ప్రభుత్వం చర్చలు జరిపిందని శుక్రవారం ఎక్స్లో ఆయన పేర్కొన్నారు. ఒలెక్ట్రా సంస్థతో కలిసి పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ నిర్ణయించినా.. నాడు కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధించడంతో ముందుకు పడలేదన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులను సరళీకరించడంతో బీవైడీ ప్లాంట్ ఏర్పాటుకు లైన్ క్లియర్అయిందన్నారు. బీవైడీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నదంటే.. నాడు తమ ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు కూడా కారణమన్నారు.
దానిని కేవలం ఓ రేసుగానే చూడొద్దన్నారు. ‘‘తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రోగ్రామ్లో భాగంగా ఫార్ములా ఈ రేస్ను నిర్వహించాం. దేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తెలంగాణను హబ్గా మార్చాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళిక ప్రకారం పనిచేశాం. అందులో భాగంగానే వినూత్నమైన ఈవీ పాలసీ, ఈవీ సమిట్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు, ఫార్ములా ఈ నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టాం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచనలు, విధానాల వల్లే బీవైడీ పెట్టుబడి వచ్చింది. ప్రభుత్వాలు మంచి విధానాలను ప్రవేశపెడితే, నీచమైన రాజకీయాలను అధిగమించి గొప్ప ఫలితాలు వస్తాయని బీవైడీ పెట్టుబడితో రుజువైంది’’ అని పేర్కొన్నారు.