
- హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: తనపై నమోదైన రెండు వేర్వేరు కేసులను కొట్టేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.2023 నవంబరు 27న ఎన్నికల ప్రచార ర్యాలీలో పటాకులు కాల్చడంతో ఆనాటి ముషీరాబాద్ ఏఎస్ఐ ఆర్. ప్రేమ్ కుమార్ ఫిర్యాదు మేరకు తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని కేటీఆర్ తన పిటిషన్లో తెలిపారు.
ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకున్నామని, పటాకుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. అందువల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే అభియోగాలపై నమోదైన కేసును కొట్టేయాలని కేటీఆర్ కోరారు. దీనిపై ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. గోపాల్, కేటీఆర్ బుధవారం పిటిషన్ దాఖలు చేశారు.
సీఎంపై విమర్శలకు పెట్టిన కేసును కూడా..
కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి సీఎం రేవంత్రెడ్డి రూ.2500 కోట్లను వసూలు చేసి ఢిల్లీకి పంపారంటూ 2024 మార్చి 27న చేసిన కామెంట్లపైనా తనపై కేసు నమోదు చేశారని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్కు చెందిన బి.శ్రీనివాసరావురాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును కొట్టివేయాలని కోరారు.
ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉందని, ఆ కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, మొత్తం విచారణ ప్రక్రియను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ను ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని, ఆ విమర్శల వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడలేదని తన పిటిషన్ లో వివరించారు. ఈ రెండు కేసుల విచారణ ప్రక్రియను నిలిపివేసి..ఎఫ్ఐఆర్ లను కొట్టేయాలని పేర్కొన్నారు. కాగా..ఈ రెండు పిటిషన్ లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారించనున్నారు.