ఖానామెట్​లో కోట్ల స్థలంపై లొల్లి

 ఖానామెట్​లో కోట్ల స్థలంపై లొల్లి
  •  కడీలు పాతడానికి వచ్చిన ఓ వర్గం 
  • తమదేనంటూ అడ్డుకున్న మరో వర్గం 
  • ఇరువర్గాల ఫిర్యాదు.. కేసు నమోదు  

మాదాపూర్​, వెలుగు: హైటెక్​సిటీ ఏరియాలో రూ. కోట్ల విలువ చేసే భూమి తమదంటూ కొందరు ఫెన్సింగ్​వేయడానికి ప్రయత్నించగా, మరో వర్గం తమదే స్థలమంటూ అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో మాదాపూర్​పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించివేశారు. రెండు వర్గాలు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశామని మాదాపూర్​ సీఐ కృష్ణమోహన్​ తెలిపారు. ఓం ప్రకాష్​రెడ్డి, నర్సింగరావు అనే వ్యక్తులతో పాటు మరికొంత మంది ఖానామెట్​సర్వే నెంబర్​11/37/ఏ లో ఉన్న ఐదెకరాల స్థలం తమదేనంటూ మంగళవారం స్థలం చుట్టూ కడీలు వేస్తున్నారు. 

మరోవైపు ఆ స్థలం తమదేనంటూ కొండలరావు అనే వ్యక్తి, ఇతడి అనుచరులు అడ్డుకున్నాడు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, పోలీసులు ఫెన్సింగ్​పనులను నిలిపివేసి, వారిని అక్కడి నుంచి పంపించివేశారు. కొండల్​రావు ఫిర్యాదు మేరకు ఓం ప్రకాష్​రెడ్డితో పాటు మరికొందరిపైనా.. అలాగే కొండల్​రావు తరఫున ఎమ్మెల్సీ నవీన్​రావు, కూకట్​పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గచ్చిబౌలిలోని మాదాపూర్​ డీసీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు.  ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్​ పోలీసులు.. సర్వే చేయాలని శేరిలింగంపల్లి తహసీల్దార్​ను కోరారు. సర్వే తర్వాత కేసు దర్యాప్తు చేపడుతామన్నారు.