
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్లోని ప్రసిద్ధ నవనాథ సిద్దులగుట్టపై కనిపించిన చిరుత పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ ఆపీసర్స్ మంగళవారం రంగంలోకి దిగారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది గుట్టను పరిశీలించి ఆలయాలు, కొనేరు, చిల్డన్స్ పార్క్ పరిసరాలను పరిశీలించారు.
చిరుత సంచారాన్ని తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. భక్తులతో కిటకిటలాడే నవనాథ సిద్దులగుట్ట మంగళవారం ఒక్కసారిగా నిర్మానుష్యంగా కనిపించింది. పులి సంచరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గుట్ట సమీపంలోకి వచ్చేందుకు భక్తులు జంకుతున్నారు. త్వరితగతిన పులిని పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.