షెడ్యూలే తరువాయి .. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను స్పీడప్​ చేసిన ఆఫీసర్లు

షెడ్యూలే తరువాయి .. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను స్పీడప్​ చేసిన ఆఫీసర్లు
  • వార్డుల వారీగా ఓటరు లిస్టు, బ్యాలెట్​ పేపర్లు సిద్ధం
  • రిజర్వేషన్​ ఆధారంగా లిస్ట్​ రెడీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశం

మహబూబ్​నగర్​, వెలుగు : సర్పంచుల పదవీ కాలం ముగిసి ఏడాది కావస్తోంది.   త్వరలో ఎన్నికల నిర్వహణకు షెడ్యుల్​ రిలీజ్​ అయ్యే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు రాష్ర్ట ప్రభుత్వం కుల గణన సర్వే పూర్తి చేయడంతో ఇందుకు బలం చేకూరుస్తోంది. షెడ్యూల్​ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు ఆఫీసర్ల బృందం ఏర్పాట్లను స్పీడప్​ చేస్తోంది.

12 విభాగాలుగా విభజన.. 

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలకు నోడల్​ ఆఫీసర్లను నియమిస్తున్నారు. మ్యాన్ పవర్ మేనేజ్​మెంట్​, బ్యాలెట్ బాక్స్ మేనేజ్​మెంట్​, రవాణా, శిక్షణ, సామగ్రి మేనేజ్​మెంట్​, ఎంసీఎంసీ మేనేజ్​మెంట్​, ఎక్స్పెండీచర్ అకౌంట్స్, ఎక్స్పెండీచర్ మానిటరింగ్ మేనేజ్​మెంట్​, ఎన్నికల పరిశీలకులు, బ్యాలెట్ పేపర్ మేనేజ్​మెంట్​, మీడియా మేనేజ్​మెంట్​, హెల్ప్ లైన్ గ్రీవెన్స్, రిపోర్ట్స్ రిటన్స్ మేనేజ్​మెంట్​ అని 12 విభాగాలు పనిచేస్తాయి.   ఒక్కొక్క విభాగానికో ఒక్కో జిల్లా ఆఫీసర్​ను నియమించారు. ఇందులో డీపీవో, డీపీఆర్​వో, డీటీవో, డీఈవో, డీఆర్​డీవో తదితరులుఉన్నారు.

బ్యాలెట్​ పేపర్ల ముద్రణకు టెండర్లు

జీపీ ఎలక్షన్​లు బ్యాలెట్​ పద్ధతిన నిర్వహించనుండటంతో ఆయా జిల్లాల్లో బ్యాలెట్​ పేపర్లుముద్రణకు కలెక్టర్లు ప్రింటింగ్​ ప్రెస్​ నిర్వాహకులకు టెండర్లుపిలవగా.. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే టెండర్లు పూర్తి అయి, ప్రింటింగ్​ పూర్తి అయ్యింది. దీంతో ఆ జిల్లాల్లో ప్రస్తుతం బ్యాలెట్​ పేపర్లను జీపీలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు గాను ఏ జీపీలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో.. అన్ని బ్యాలెట్ పేపర్లకు సీరియల్​ వైజ్​గా నంబరింగ్ వేస్తున్నారు. ఈ నంబరింగ్​ పూర్తి కాగానే.. పోలింగ్​ స్టేషన్​ల వారీగా బ్యాలెట్ పేపర్లను పంపిణీ 
చేయనున్నారు. 

మార్పులు.. చేర్పులు..

గతేడాది నంబరులో ఎలక్షన్​ కమిషన్​ పంచాయతీ ఓటర్ లిస్టును రిలీజ్​ చేసింది. ఆ లిస్టును పంచాయతీ సిబ్బంది ఆయా జీపీ నోటీసు బోర్డుల వద్ద అతికించారు. అయితే మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడంతో చాలా మంది తమ ఓటు ఎక్కడుందనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఓ వార్డులో నివాసం ఉండి మరో వార్డులో ఓటరు జాబితాలో పేరు వస్తే వాటికి సిబ్బంది సరి చేస్తున్నారు. ఇంటి పేర్లు, వయస్సు, తండ్రి పేర్లు తప్పుడగా పడితే, పంచాయతీ సిబ్బందికి చెప్పి వాటిని సరి చేయించుకుంటున్నారు. నోడల్​ ఆఫీసర్లు కూడా గ్రామాలను విజిట్​ చేస్తున్నారు. ఓటర్లు లిస్టు, పోలింగ్​ స్టేషన్​లను పరిశీలిస్తున్నారు.

రిజర్వేషన్​ ఆధారంగా తీయాలని..

రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల కుల గణన సర్వే పూర్తి చేసింది. ఇప్పటికే జీపీలలో ఓటరు జాబితాను అతికించారు. పంచాయతీ సిబ్బంది వార్డుల వారీగా ఓటరు జాబితాను తీస్తున్నారు. అయితే రిజర్వేషన్​ ఆధారంగా కూడా ఓటరు జాబితాను రెడీ చేయాలని పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రిజర్వేషన్​ ఆధారంగా వార్డుల వారీగా లిస్టును తయారు ద్వారా ఆ పంచాయతీని ఏ కేటగిరీకి రిజర్వ్​ చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.