
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్టాండింగ్ కమిటీ సభ్యులను కోరారు. శనివారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. 8 అంశాలపై చర్చించి ఆమోదించారు. కొత్తగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులను మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఇలంబరితి సన్మానించారు. స్టాండింగ్ కమిటీ పాలసీ నిర్ణయాల కమిటీ అని, నిర్మాణాత్మక, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుని నగర అభివృద్ధికి కలిసి కట్టుగా పనిచేయాలని మేయర్కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తుందన్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, మహాలక్ష్మి రమన్ గౌడ్, మహమ్మద్ గౌస్ ఉద్దీన్, సి.ఎన్.రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, బురుగడ్డ పుష్ప నగేష్, అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, వేణుగోపాల్, పంకజ, గీతా రాధిక, రఘు ప్రసాద్, చంద్రకాంత్ రెడ్డి, యాదగిరి రావు తదితరులు పాల్గొన్నారు.
రూ. 1.71 కోట్ల పనులకు శంకుస్థాపన
బంజారాహిల్స్ డివిజన్ ఎమ్మెల్యే కాలనీలో రూ.1.71 కోట్లతో చేపట్టనున్న మురుగు నీరు పైప్లైన్నిర్మాణ పనులకు మేయర్విజయలక్ష్మి శనివారం శంకుస్థాపన చేశారు. నీటి నిల్వలు, ఓవర్ ఫ్లో, లీకేజీల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాటర్ వర్క్స్ జీఎం హరిశంకర్, మేనేజర్ రాంబాబు, జీహెచ్ఎంసీ ఈఈ విజయ్ కుమార్ పాల్గొన్నారు.