
- కుటుంబంలో గొడవలే కారణం
- మెదక్ జిల్లాలో విషాదం
మెదక్, వెలుగు: ఆత్మహత్యాయత్నం చేసిన భర్త దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా.. కలత చెందిన భార్య ఐదేండ్లలోపు ఇద్దరు కూతుళ్లతో సహా చెరువులో దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా కొంటూర్లో మంగళవారం జరిగింది. మెదక్ డీఎస్పీ సైదులు కథనం ప్రకారం..మెదక్ మండలం వెంకటాపూర్కు చెందిన లక్ష్మికి రామాయంపేట మండలం అక్కన్నపేటకు చెందిన కొక్కుల ఎల్లంతో ఏడేండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. తొమ్మిది రోజుల కింద భార్యాభర్తలిద్దరు గొడవ పడ్డారు. ఆవేశపడ్డ భర్త ఎల్లం పురుగుల మందు తాగాడు. అతడిని మెదక్లోని ఓ ప్రైవేట్హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతున్నాడు. వెంకటాపూర్లోని తల్లిగారింట్లో ఉన్న లక్ష్మి (28)మంగళవారం హాస్పిటల్ లో ఉన్న భర్తను చూసేందుకు ఇద్దరు కూతుళ్లు శరణ్య (4), శ్రావ్య (3) లతో మెదక్ కు వచ్చింది.
హాస్పిటల్లో ఉన్న భర్తను చూసిన తర్వాత ఆటోలో వెంకటాపూర్కు తిరిగి వెళ్లే క్రమంలో కొంటూరు వద్ద దిగింది. అక్కడి నుంచి వెంకటాపూర్కు వెళ్లకుండా ఇద్దరు బిడ్డలతో సహా కొంటూర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారమివ్వగా మెదక్ డీఎస్పీ సైదులు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెరువులో నుంచి లక్ష్మి,శరణ్య, శ్రావ్య మృతదేహాలను వెలికి తీయించి పోస్టుమార్టం కోసం మెదక్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెదక్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దవాఖానలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం చేశారు.