మెదక్​ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి.. ఇక టీచింగ్ హాస్పిటల్

మెదక్​ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి..  ఇక టీచింగ్ హాస్పిటల్
  • మెడికల్ కాలేజీ రాకతో టీవీవీపీ నుంచి డీఎంఈ పరిధిలోకి మార్పు

మెదక్​, వెలుగు: ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి టీచింగ్ హాస్పిటల్ గా మారింది. మెదక్ పట్టణంలో కొత్తగా గవర్నమెంట్​ మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్ ) డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఏంఈ) లో విలీనమైంది. 

మెడికల్ కాలేజీ ప్రారంభంతో..

అవసరమైన మౌలిక వసతులు సమకూర్చి ప్రపోజల్స్​ పంపగా మెదక్​లో 50 సీట్లతో గవర్నమెంట్​మెడికల్ కాలేజీ ఏర్పాటుకు గత సెప్టెంబర్​లో నేషనల్​ మెడికల్ కౌన్సిల్​(ఎన్ఎంసీ) నుంచి పర్మిషన్​ లభించింది. ఈ మేరకు డైరెక్టర్​ఆఫ్​మెడికల్​ఎడ్యుకేషన్​(డీఎంఈ) ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ నిర్వహణకు ప్రిన్సిపాల్​ను నియమించడంతో పాటు, ఎంబీబీఎస్​ స్టూడెంట్స్​కు బోధించేందుకు అవసరమైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్​ప్రొఫెసర్లు, ఇతర డాక్టర్లు, పారామెడికల్​ స్టాఫ్​ నియామకాలు చేపట్టారు. ఎన్ఎంసీ గైడ్ లైన్స్​ప్రకారం130 బెడ్స్​కెపాసిటీ ఉన్న ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, 100 బెడ్స్​కెపాసిటీ గల మాతా శిశు సంరక్షణ కేంద్రంతో పాటు కొత్తగా నిర్మిస్తున్న 50 బెడ్స్ ​కెపాసిటీ గల క్రిటికల్​ కేర్​ సెంటర్​ను మెడికల్ కాలేజీకి అనుసంధానించారు. 

పూర్తయిన విలీన ప్రక్రియ

మెడికల్ కాలేజీ ప్రారంభమైన నేపథ్యంలో డీఎంఈ ఆదేశాల మేరకు టీవీవీపీ  పరిధిలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, ఏంసీహెచ్​ను  డీఎంఈలో విలీనం చేశారు. ఇటీవల ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. దీంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో, ఎంసీహెచ్​లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది వారి వారి హోదాలకు అనుగుణంగా టీవీవీపీ పరిధిలోని ఇతర ఆస్పత్రులకు వెళ్లనున్నారు. 

ఇకనుంచి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, ఎంసీహెచ్ గవర్నమెంట్​ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పర్యవేక్షణలో కొనసాగుతాయి. ఆయా ఆస్పత్రుల్లో మెడికల్​కాలేజీకి సంబంధించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్​ప్రొఫెసర్లు, డాక్టర్ల ఆధ్వర్యంలో వైద్యసేవలు అందుతాయి.