అప్పులపై తప్పుడు ప్రచారానికి రేవంత్​ తిప్పలు : ఎమ్మెల్సీ కవిత

అప్పులపై  తప్పుడు ప్రచారానికి రేవంత్​ తిప్పలు : ఎమ్మెల్సీ కవిత
  •  అబద్ధాలు కొనసాగిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: అప్పులపై సీఎం రేవంత్​ రెడ్డి తప్పుడు ప్రచారం చేసేందుకు తిప్పలు పడుతున్నారని, అయినా అవన్నీ పటాపంచలు అవుతున్నాయని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాంగ్రెస్​ సర్కారు చేస్తున్నది దుష్ప్రచారమేనని పార్లమెంట్​ సాక్షిగా బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.4.42 లక్షల కోట్లేనని పార్లమెంట్​లో కేంద్రం ప్రకటించినట్లు గుర్తుచేశారు. కానీ, సీఎం రేవంత్​ రెడ్డి దానిని రెండింతలు చేసి రూ.8 లక్షల కోట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

శుక్రవారం శాసనమండలి మీడియా పాయింట్​లో పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు. అబద్ధాలను కొనసాగిస్తే ప్రజలే ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోతున్నాయన్నదానిలో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలపై సీఎం రేవంత్​పరుష పదజాలంతో మాట్లాడారని మండిపడ్డారు. కాగా.. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహం ఏర్పాటు చేసేందుకు సహకరించాలని మండలి డిప్యూటీ చైర్మన్​ బండ ప్రకాశ్​ను కవిత కోరారు.  ఏప్రిల్​ 27న వరంగల్​ జిల్లా ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ ​పార్టీ రజతోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.